టీ20 ప్రపంచకప్ (T20 World Cup) మిస్సయినా.. బంగ్లాదేశ్ (Bangladesh) జాక్ పాట్ కొట్టింది. నిబంధనల ప్రకారం టోర్నీకి దూరమైనందుకు ఐసీసీ (ICC) సీరియస్ అవుతుందని, భారీ జరిమానా వేస్తుందని అంతా అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. శిక్ష వేయడం పక్కనపెడితే.. ఐసీసీ బంగ్లాదేశ్ కు ఒక భారీ గిఫ్ట్ ఇచ్చింది. ఆ గిఫ్ట్ ఏంటి? ఐసీసీ ఎందుకు అంత ఉదారంగా వ్యవహరించింది?
ఫైన్ లేదు.. ఆంక్షలు లేవు!
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఊపిరి పీల్చుకుంది. టీ20 ప్రపంచకప్లో పాల్గొనకపోవడంపై ఐసీసీ కీలక ప్రకటన చేసింది. బీసీబీపై ఎలాంటి ఆర్థిక జరిమానా గానీ, క్రీడాపరమైన ఆంక్షలు గానీ (No Sanctions) విధించడం లేదని స్పష్టం చేసింది. ఐసీసీ, పాకిస్థాన్, బంగ్లాదేశ్ బోర్డుల మధ్య జరిగిన చర్చలు స్నేహపూర్వకంగా ముగిశాయని, శిక్షించడం కంటే సపోర్ట్ చేయడమే తమ ఉద్దేశమని ఐసీసీ తేల్చిచెప్పింది. అయితే, అవసరమైతే వివాద పరిష్కార కమిటీని (DRC) ఆశ్రయించే హక్కు బీసీబీకి అలాగే ఉంటుంది.
2031కి ముందే మరో మెగా టోర్నీ..
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. జరిమానా మాఫీ చేయడమే కాకుండా.. 2031 పురుషుల ప్రపంచకప్ కంటే ముందే బంగ్లాదేశ్ లో ఒక ఐసీసీ ఈవెంట్ (ICC Event) నిర్వహించడానికి ఒప్పందం కుదిరింది. అంటే బంగ్లాదేశ్ గడ్డపై మళ్లీ క్రికెట్ పండగ జరగబోతోందన్నమాట. ఆ దేశంలో క్రికెట్ ను బలోపేతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సంజోగ్ గుప్తా ఏమన్నారంటే?
"బంగ్లాదేశ్ ఈ వరల్డ్ కప్ లో లేకపోవడం బాధాకరమే. కానీ ఆ దేశానికి ఐసీసీ ఇచ్చే ప్రయారిటీలో మార్పు లేదు. అక్కడ క్రికెట్ అభివృద్ధికి మా వంతు కృషి చేస్తాం" అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజోగ్ గుప్తా (Sanjog Gupta) భరోసా ఇచ్చారు. క్రికెట్ ప్రపంచంలో ఐక్యతను చాటడమే ఈ ఒప్పందం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.
దౌత్యం గెలిచింది!
శిక్ష వేసి దూరం చేసుకోవడం కంటే.. అక్కున చేర్చుకుని క్రికెట్ ను కాపాడటమే బెటర్ అని ఐసీసీ భావించింది. ఇది బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్ కు నిజంగా స్వీట్ న్యూస్.

