India vs USA T20 World Cup: సూర్య భాయ్ 'కెప్టెన్' ఇన్నింగ్స్.. అమెరికాపై టీమిండియా బోణీ!
సొంతగడ్డపై ప్రపంచకప్ వేట మొదలైంది. వాంఖడే స్టేడియంలో శనివారం జరిగిన తొలి పోరులో టీమిండియా తడబడింది.. కానీ నిలబడింది. 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తన భుజాలపై మోశాడు. అమెరికాను 29 పరుగుల తేడాతో చిత్తు చేసి భారత్ కు శుభారంభాన్ని అందించాడు. టాపార్డర్ కుప్పకూలినా.. సూర్య ఎలా ఆదుకున్నాడు? బౌలర్లు మ్యాచ్ ను ఎలా మలుపు తిప్పారు?
46/4.. పీకల్లోతు కష్టాల్లో భారత్
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ కాగా, ఇషాన్ కిషన్ (20), తిలక్ వర్మ (25) దారుణంగా విఫలమయ్యారు. ఒకే ఓవర్లో తిలక్, శివమ్ దూబే (0) అవుట్ కావడంతో స్కోరు బోర్డు 46/4 గా మారింది. టీమిండియా 100 పరుగులు కూడా దాటదేమో అని ఫ్యాన్స్ భయపడ్డారు.
సూర్య 'వన్ మ్యాన్ షో'.. 84 నాటౌట్
అప్పుడే క్రీజులో ఉన్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన విశ్వరూపం చూపించాడు. వికెట్లు పడుతున్నా.. తనదైన శైలిలో షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. కేవలం 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో అక్షర్ పటేల్ (14) సాయంతో భారత్ 20 ఓవర్లలో 161 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.
సిరాజ్, అర్ష్దీప్ దెబ్బ.. అమెరికా విలవిల
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికాకు భారత పేసర్లు చుక్కలు చూపించారు. మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj), అర్ష్దీప్ సింగ్ ధాటికి 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మిలింద్ కుమార్ (34), సంజయ్ (37), చివర్లో శుభమ్ రంజనే (37) పోరాడినా ఫలితం లేకపోయింది. సిరాజ్ 3 వికెట్లు, అర్ష్దీప్, అక్షర్ చెరో రెండు వికెట్లు తీయడంతో అమెరికా 132 పరుగులకే పరిమితమైంది.
తదుపరి మ్యాచ్ ఎప్పుడు?
ఈ విజయంతో గ్రూప్-ఏలో భారత్ ఖాతా తెరిచింది. ఇక టీమిండియా తన తదుపరి మ్యాచ్ ను ఫిబ్రవరి 12న ఢిల్లీ వేదికగా నమీబియాతో ఆడనుంది. ఈ మ్యాచ్ లోనైనా టాపార్డర్ రాణించాలని ఆశిద్దాం.
గెలిచాం కానీ.. ఆ లోపాలు సరిదిద్దుకోవాలి!
సూర్య లేకపోతే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న ఈ మ్యాచ్ రేకెత్తించింది. టాపార్డర్ వైఫల్యాన్ని సరిదిద్దుకుంటేనే కప్పు కల సాకారం అవుతుంది.

