Tirumala Laddu Adulteration Issue: కోనేటిలో మునిగి ఏడవండి! మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు
తిరుమల లడ్డూ అంటే అది కేవలం ప్రసాదం కాదు.. కోట్లాది మంది భక్తుల నమ్మకం, ఉద్వేగం. ఆ నమ్మకంలో విషం కలిపిన వారికి మామూలు శిక్షలు సరిపోవట. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని టీటీడీ మాజీ ఈవో, రిటైర్డ్ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం (LV Subrahmanyam) హెచ్చరించారు. "రాజకీయాలు పక్కనపెట్టి.. వెళ్లి కోనేటిలో మునిగి ఏడవండి, అంగప్రదక్షిణలు చేయండి" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. వ్యవస్థలో లోపల ఏం జరుగుతుందో తెలిసిన ఒక మాజీ అధికారి ఇంత ఘాటుగా ఎందుకు స్పందించారు?
రాజకీయం కాదు.. ఇది మహాపాపం!
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం (Tirumala Laddu Adulteration)పై ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం పరిపాలనాపరమైన తప్పిదం కాదని, అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. "అక్రమాలకు పాల్పడిన వారు శిక్షలు తప్పించుకోవచ్చు అనే ధైర్యంతో ఉన్నారు. కానీ దేవుడిని మోసం చేసిన వారికి శిక్ష తప్పదు. ఇప్పటికైనా ఈ పాపాన్ని రాజకీయ కోణంలో చూడటం మానేయండి. తప్పును ఒప్పుకుని స్వామివారి ముందు సాష్టాంగపడండి" అని హితవు పలికారు. తిరుమల సన్నిధిలో పనిచేసే వారిలో 'చిత్తశుద్ధి' లోపించిందని ఆయన ఆరోపించారు.
రోజుకు 18 వేల కిలోల నెయ్యి.. ఎంత దారుణం?
లడ్డూ ప్రసాదం తయారీకి, అన్నప్రసాదానికి కలిపి రోజుకు సుమారు 13 వేల నుంచి 18 వేల కిలోల నెయ్యిని ఉపయోగిస్తారు. ఇంత భారీ మొత్తంలో కల్తీ జరగడం అంటే మాటలు కాదు. "నెయ్యి నాణ్యత లేదని తెలిసినప్పుడే ఆ ట్యాంకర్లను ఎందుకు ఆపలేదు? అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు?" అని ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. పవిత్రమైన ప్రసాదంలో రసాయనాలు, జంతు కొవ్వు కలపడం ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాక, స్వామివారిని అపవిత్రం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు చెప్పినప్పుడే షాక్ అయ్యా..
2024లో లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసినట్లు సీఎం చంద్రబాబు తనకు చెప్పినప్పుడు షాక్ అయ్యానని ఎల్వీ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ, సిట్ (SIT) దర్యాప్తు చేస్తున్నాయని, త్వరలోనే నిజాలు నిగ్గుతేలుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, కోర్టు శిక్షల కంటే ముందు.. నిందితులు తమ అంతరాత్మను ప్రశ్నించుకోవాలని ఆయన సూచించారు.
చట్టం వదిలినా.. కర్మ వదలదు!
లడ్డూ కల్తీ అనేది కేవలం అవినీతి మాత్రమే కాదు, అది ఆధ్యాత్మిక ద్రోహం. మాజీ ఈవో చెప్పినట్లు.. నిందితులు కోనేటిలో మునిగినా ఆ పాపం పోతుందో లేదో తెలియదు కానీ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు మాత్రం అత్యవసరం.

