US Jewelry Store Heist: అమెరికాలో ఇండియన్ షాపులో భారీ దోపిడీ.. 70 సెకన్లలో 16 కోట్లు స్వాహా!
వరంగల్, హైదరాబాద్ లాంటి నగరాల నుంచి అమెరికాకు వెళ్లి వ్యాపారాలు చేసుకుంటున్న ఎంతోమంది భారతీయులను తీవ్ర ఆందోళనకు గురిచేసే భయానక ఘటన ఇది. కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన వర్మ కుటుంబం నడుపుతున్న నగల దుకాణంలో జరిగిన ఒక భారీ దోపిడీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సుమారు 20 మంది ముసుగు దుండగులు పక్కా ప్లానింగ్ తో వచ్చి, కేవలం 70 సెకన్ల వ్యవధిలో ఏకంగా రూ.16 కోట్ల (1.7 మిలియన్ డాలర్లు) విలువైన బంగారు, వజ్రాభరణాలను ఊడ్చేశారు. గతేడాది జరిగిన ఈ దోపిడీ సర్వైలెన్స్ ఫుటేజ్ను యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ తాజాగా విడుదల చేయడంతో, అసలు ఆ 70 సెకన్లలో ఏం జరిగిందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
సినిమాను మించిన ప్లానింగ్.. నిమిషం లోపే ఖాళీ
ఈ దారుణమైన దోపిడీ కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్లో ఉన్న 'కుమార్ జువెలర్స్' అనే షోరూంలో 2025 జూన్ 18న జరిగింది. తాజాగా విడుదలైన సీసీటీవీ వీడియోలో ఆ ముసుగు దుండగుల కిరాతకం కళ్లకు కట్టినట్లు రికార్డయింది. దాదాపు 20 నుంచి 24 మంది ముసుగులు ధరించిన దుండగులు ఒకేసారి ఒక సైనిక బృందంలా షోరూంలోకి చొరబడ్డారు. వారి చేతుల్లో ఉన్న సుత్తులు, ఇతర ఇనుప పరికరాలతో షోరూంలోని డిస్ప్లే కేస్లను విచక్షణారహితంగా పగలగొట్టారు. ఒక దుండగుడు సెక్యూరిటీ గార్డుకు తుపాకీ గురిపెట్టి బెదిరించగా, మిగతా వారు అత్యంత వేగంగా నగలను సంచుల్లో నింపుకున్నారు. కేవలం 70 సెకన్లలోనే తమ పని పూర్తి చేసుకుని, బయట సిద్ధంగా ఉంచుకున్న దొంగిలించిన వాహనాల్లో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దోపిడీలో దుకాణంలోని దాదాపు 80 శాతం విలువైన సరుకును దుండగులు ఎత్తుకెళ్లినట్లు వర్మ కుటుంబం కన్నీటిపర్యంతమైంది.
The Department of Justice has released footage of thugs stealing $1.7 million of jewelry in about one minute in Fremont, California.
— Collin Rugg (@CollinRugg) March 13, 2026
The incident happened on June 18, 2025, at Kumar Jewelers.
The thugs were able to steal about 75% of the store's merchandise.
According to… pic.twitter.com/tTkcLek0w5
నలుగురు నిందితుల అరెస్ట్.. గరిష్టంగా 20 ఏళ్ల జైలు
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అమెరికా ఫెడరల్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేసి కీలక పురోగతి సాధించారు. ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ తాజాగా నలుగురు నిందితులపై అభియోగాలు నమోదు చేసింది. వారిని అఫాతుపెటైకి ఫాసిసిలా, జోస్ హెర్రాడా-అరగోన్, ఆండ్రెస్ పలెస్టినో, టామ్ పార్కర్ డొనెగన్ అనే యువకులుగా గుర్తించారు. ఈ దోపిడీ నేరం గనుక కోర్టులో రుజువైతే వీరికి గరిష్టంగా 20 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. ఈ ఘటనలో పాల్గొన్న మిగతా నిందితుల కోసం దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు. గతేడాది జరిగిన ఈ దోపిడీ వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో, అమెరికాలో స్థిరపడిన భారతీయ వ్యాపారుల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
పగటిపూట, అదీ అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో పదుల సంఖ్యలో వచ్చి ఇలా దోచుకెళ్లడం అక్కడి శాంతిభద్రతల వైఫల్యాన్ని సూచిస్తోంది. కష్టపడి పైకొచ్చిన భారతీయుల వ్యాపారాలకు రక్షణ లేకుండా పోతోంది. అమెరికాలో ఉంటున్న మన బంధుమిత్రులు, ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు భద్రతా ప్రమాణాలను (అడ్వాన్స్డ్ అలారం సిస్టమ్స్, ఆటోమేటిక్ సెక్యూరిటీ డోర్స్) మరింత కట్టుదిట్టం చేసుకోవాల్సిన అవసరం ఈ వీడియో చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.

