విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన పవిత్రమైన సరస్వతీ నిలయం.. మూఢనమ్మకాలకు, నెత్తురోడే బలులకు అడ్డాగా మారితే ఎలా ఉంటుంది? అక్షరాలు దిద్దాల్సిన కళాశాల ప్రాంగణంలో దెయ్యాలు, ప్రేతాత్మలు తిరుగుతున్నాయన్న వదంతులతో ఏకంగా ఒక గుడి కట్టి మంత్రతంత్రాలు చేస్తే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? వినడానికే వెన్ను జలదరించే ఈ భయంకరమైన ఘటన సాక్షాత్తూ ఒక ప్రభుత్వ కాలేజీలోనే జరిగింది. మూఢభక్తితో కోళ్లు, మేకలను బలిచ్చిన ఈ దారుణ ఉదంతం ఇప్పుడు విద్యావ్యవస్థనే నివ్వెరపరుస్తోంది.
హిమాలయాల సాక్షిగా.. దెయ్యాల కలకలం!
ఉత్తరాఖండ్ రాష్ట్రం.. హిమాలయ పర్వతాల ఒడిలో ఉండే బాగేశ్వర్ జిల్లాలోని కౌసాని గ్రామం. అక్కడ ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతున్న విద్యార్థినులకు గత కొద్ది రోజులుగా విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది. క్లాసులో పాఠాలు వింటున్న అమ్మాయిలు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కింద పడిపోతున్నారు.
రోజురోజుకూ ఈ ఘటనలు పెరిగిపోతుండటంతో.. ఆ కాలేజీలో ఏదో అదృశ్య శక్తి ఉందని, కచ్చితంగా దెయ్యాలు, ప్రేతాత్మలు తిరుగుతున్నాయనే వదంతులు గ్రామంలో దావానలంలా వ్యాపించాయి. ఆ ప్రేతాత్మల వల్లే విద్యార్థినులు భయభ్రాంతులకు గురై స్పృహతప్పి పడిపోతున్నారని తల్లిదండ్రులు, గ్రామస్తులు బలంగా నమ్మడం మొదలుపెట్టారు.
చందాలు వేసి.. కాలేజీలోనే గుడి నిర్మాణం!
పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, స్థానికులు.. దీనికి శాంతి పూజలు చేయడం ఒక్కటే అసలైన పరిష్కారమని ఒక మూఢ నిర్ణయానికి వచ్చారు. ఆ ప్రేతాత్మల నుంచి తమ పిల్లలను కాపాడుకోవడానికి ఏకంగా కాలేజీ ప్రాంగణంలోనే ఓ ఆలయాన్ని నిర్మించాలని భారీ స్కెచ్ వేశారు.
ఇందుకోసం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఏకంగా తలో రూ.100 చొప్పున చందాలు కూడా వసూలు చేశారు. అలా పోగైన డబ్బుతో కాలేజీ ఆవరణలోనే ఒక చిన్న గుడిని కట్టేశారు. ఆ ప్రేతాత్మను శాంతింప చేయడానికి కాలేజీ సిబ్బంది, గ్రామస్తులు అంతా ఏకమై ఆ గుడి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతటితో ఆగకుండా శాంతి పేరుతో మూగజీవాలైన కోళ్లు, మేకలను కాలేజీలోనే దారుణంగా బలి ఇచ్చారు.
రంగంలోకి విద్యాశాఖ.. నివేదికకు ఆదేశం!
చదువుల గుడిలో జరిగిన ఈ బలులు, మూఢనమ్మకాల వ్యవహారం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. ఒక ప్రభుత్వ కాలేజీలో ఇంతటి దారుణం జరగడంపై అధికారులు సీరియస్ అయ్యారు. బాగేశ్వర్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఈ ఘటనపై తక్షణ విచారణకు ఆదేశించారు. వారం రోజుల్లోగా పూర్తిస్థాయి విచారణ జరిపి తనకు సమగ్ర నివేదికను సమర్పించాలని బ్లాక్ స్థాయి అధికారికి కఠిన ఆదేశాలు జారీ చేశారు.
వైరల్ వీడియో.. అసలు ట్విస్ట్ ఇదే!
విద్యాశాఖ విచారణకు ఆదేశించిన వెంటనే, ఈ కథలో ఒక అనూహ్యమైన ట్విస్ట్ ఎదురైంది. సోషల్ మీడియాలో ఒక వీడియో హాట్ టాపిక్గా మారి వైరల్ అయింది. కౌసాని కాలేజీ పేరెంట్స్ టీచర్ అసోసియేషన్ (PTA) అధ్యక్షుడు స్వయంగా ఈ వివరణతో కూడిన వీడియోను పోస్ట్ చేస్తూ పలు సంచలన విషయాలు వెల్లడించారు.
కాలేజీ పరిసర ప్రాంతాల్లో కొందరు కోళ్లు, మేకలను బలిస్తున్నారని, ఆ భయంకరమైన దృశ్యాలను చూసే విద్యార్థులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారని ఆయన అందులో చెప్పుకొచ్చారు. ఆ మూగజీవాల బలులను అడ్డుకోవడానికే తాము కాలేజీలో గుడి నిర్మించామని ఒక కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఆ గుడి వల్ల విద్యార్థుల్లో ఆత్మల భయం పోగొట్టే ప్రయత్నం జరిగిందని సమర్థించుకున్నారు.
ఆ ఆలయం దగ్గర కేవలం శాంతి పూజలు మాత్రమే చేశామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, గుడి నిర్మాణం కోసం ఎవరి వద్దా బలవంతంగా డబ్బులు వసూలు చేయలేదని, అంతా ఇష్టపూర్వకంగానే ఇచ్చారని ఆయన ఆ వీడియోలో కుండబద్దలు కొట్టారు.
చదువుల తల్లి కొలువైన ప్రాంగణంలో, అంధవిశ్వాసాల చీకట్లు కమ్ముకోవడం ఆధునిక సమాజానికే ఒక మాయని మచ్చ. విద్యాబుద్ధులు నేర్పాల్సిన చోటే మూఢనమ్మకాలు రాజ్యమేలితే.. ఇక రేపటి పౌరుల భవిష్యత్తు ఎటు వైపు పయనిస్తుందో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది!
Also Read:
Kerala Elections: పినరయి, మోదీలపై సీఎం రేవంత్ ఫైర్Global Economic Crisis: కొవిడ్ కంటే పెద్ద ముప్పు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధం ఎఫెక్ట్
పెళ్లి ఇష్టం లేదు.. ప్రియుడే కావాలి: మధ్యప్రదేశ్ హైకోర్టు చారిత్రక తీర్పు
పనిమనిషికి థార్ కారు.. గర్ల్ ఫ్రెండ్కు ప్లాట్లు: బిహార్ డీఎస్పీ అవినీతి బాగోతం!
Amrit Bharat Express 3.0 : జనరల్ నుంచి ఏసీకి.. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ 3.0 ప్రత్యేకతలు ఇవే

