ఒక నాయకుడు పీఠం ఎక్కిన తర్వాత ప్రతిపక్షాన్ని ఎలా చూస్తాడు అన్నదానిపైనే.. ఆ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సామాన్యుడికి ఈ అసెంబ్లీ గొడవలు ఎందుకు ముఖ్యం అంటే, చట్టసభల్లో నాయకులు ఇచ్చే గౌరవమే రేపు రోడ్డు మీద సామాన్యుడికి దక్కుతుంది! మొన్నటి తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ ఒంటరి పోరాటం చూసి.. ఏపీలో వైసీపీ నేతలు ఎగిరి గంతేశారు. తమ అధినేత జగన్ కూడా ఇలాగే ఒంటరిగా వచ్చి మళ్లీ గెలుస్తాడని సోషల్ మీడియాను షేక్ చేశారు. కానీ, వారి ఆనందం మూన్నాళ్ల ముచ్చటే అయింది.
జగన్తో దళపతి పోలిక.. వైసీపీ అత్యుత్సాహం!
తమిళనాట విజయ్ గెలవగానే వైసీపీ బ్యాచ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. విజయ్ సింగిల్ టార్గెట్ విజయాన్ని నేరుగా జగన్తో పోల్చేశారు. సింగిల్గా వచ్చి కుమ్మేశాడంటూ స్టేటస్లు పెట్టుకున్నారు.
కానీ, ఈ పోలిక వెనుక ఉన్న అసలు నిజాన్ని వారు మర్చిపోతున్నారని మొదటి నుంచి కూటమి నేతలు గట్టిగా హెచ్చరిస్తూనే ఉన్నారు. విజయ్ వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించే రకం కాదు. రాజకీయంగా పోరాడతాడే తప్ప, వ్యక్తిగత దూషణలకు ఆయన ఎప్పుడూ దూరం.
అసెంబ్లీలో దళపతి ఆదర్శం.. ప్రతిపక్షానికి పెద్దపీట!
విజయ్ అసెంబ్లీలో బలనిరూపణ నెగ్గిన తర్వాత మాట్లాడిన తీరు నిజంగా ప్రతి రాజకీయ నాయకుడికి ఒక ఆదర్శ పాఠం. చట్టసభలో అందరూ సమానమేనని, అందరికీ సమాన గౌరవం ఇస్తానని ఆయన తేల్చి చెప్పారు.
ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నా సరే, వారి గళానికి, వారి అభిప్రాయాలకు చట్టసభలో సమానమైన ప్రాధాన్యత ఇస్తానని ప్రకటించి అందరి హృదయాలను గెలుచుకున్నారు.
నాడు ఏపీ చట్టసభల్లో ఏం జరిగింది?
అసెంబ్లీలో ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు అని విజయ్ చెప్పిన ఒక్క మాటతో ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన రాజకీయం ఏంటో అర్థమవుతోంది. మరి జగన్ హయాంలో ఏం జరిగింది?
అధికార మదంతో ప్రతిపక్ష పార్టీల నాయకుల ఇళ్లలోని ఆడవాళ్లను సైతం మంత్రులతో బూతులు తిట్టించిన భయంకరమైన చరిత్ర ఆయనది. నిండు సభలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును ఎంత దారుణంగా అవమానించారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. చంద్రబాబు సతీమణిని సైతం రాజకీయాల్లోకి లాగి కించపరిచిన ఘనత వైసీపీకే దక్కుతుంది.
తేడిపోయిన పోలిక.. ఇరుక్కున్న వైసీపీ!
ప్రవర్తనలో, సంస్కారంలో ఇంతటి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉన్నప్పుడు.. జగన్, విజయ్ ఎలా ఒక్కటవుతారు? కేవలం సింగిల్గా పోటీ చేసినంత మాత్రాన ఇద్దరూ ఒకటే అని తొందరపడి పోల్చుకున్న వైసీపీ నేతలు.. ఇప్పుడు తమ పరువు తామే తీసుకుంటున్నారు.
విజయ్ అసెంబ్లీలో హుందాగా మాట్లాడుతున్న తీరు చూసి, ఆయనకు జగన్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని స్వయంగా వైసీపీ శ్రేణులే లోలోపల మదనపడుతున్నాయి.
అధికారం రావడం గొప్ప కాదు.. ఆ అధికారాన్ని ఎంత హుందాగా భరించామన్నదే ఒక నాయకుడి అసలైన విజయం! ఒకప్పుడు ఏపీ అసెంబ్లీని వ్యక్తిగత దూషణలకు, బూతులకు అడ్డాగా మార్చిన నాయకుడికి, తొలి అడుగులోనే ప్రతిపక్షాన్ని గౌరవిస్తానని చెప్పిన విజయ్కి ఎలాంటి పోలికా లేదు. విజయ్ నడుస్తున్న దారి చూశాకైనా, రాజకీయం అంటే బూతులు తిట్టడం కాదు, హుందాతనంగా వ్యవహరించడం అని మన నాయకులు నేర్చుకుంటే.. సామాన్యుడికి ప్రజాస్వామ్యంపై, చట్టసభలపైనా నమ్మకం పెరుగుతుంది!

