టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కింగ్ డమ్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ మరియు పాటలకు మంచి స్పందన లభించింది. ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన సూర్య నటించిన 'రెట్రో' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. విజయ్ చేసిన వ్యాఖ్యలపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేయగా, గిరిజనులను అవమానించేలా మాట్లాడారంటూ తెలంగాణ ట్రైబల్స్ అసోసియేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదంపై విజయ్ దేవరకొండ తాజాగా స్పందించారు. తన ట్విట్టర్ వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్ చేస్తూ ఆయన ఈ వివాదానికి పూర్తి వివరణ ఇచ్చారు.
విజయ్ దేవరకొండ వివరణ
విజయ్ తన పోస్ట్లో ఇలా పేర్కొన్నారు: "ఇటీవల రెట్రో మూవీ ఈవెంట్లో నేను చేసిన వ్యాఖ్యలు కొందరి మనోభావాలను దెబ్బతీసినట్లు నా దృష్టికి వచ్చింది. నేను వాటిపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఏ వర్గాన్ని, ఏ తెగను బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. వారందరినీ నేను ఎంతగానో గౌరవిస్తాను. భారతదేశంలోని ప్రజలంతా ఒక్కటేనని నేను నమ్ముతాను. మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి. ఐక్యంగా ఉండాలి.
నేను ఏ సమూహం పట్ల ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ వివక్ష చూపలేదు. వారందరూ నా కుటుంబ సభ్యులే, నా సోదరులే అని భావిస్తాను. నేను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి. నేను శాంతి, అభివృద్ధి, ఐక్యత గురించి మాత్రమే మాట్లాడాను. 'ట్రైబ్' అనే పదాన్ని నేను వేరే అర్థంలో ఉపయోగించాను. నాగరికత మొదలు కాకముందు క్లాన్స్, రాజ్యాలు అంటూ ఉండేవి. అంతేకానీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి కాదు. 20వ శతాబ్దంలో ఈ 'ట్రైబ్స్' పదాన్ని పెట్టారు." అంటూ ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
'కింగ్ డమ్' విడుదల
ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న 'కింగ్ డమ్' చిత్రం మే 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్లలో భాగంగా విడుదలైన ఫస్ట్ సింగిల్కు మంచి స్పందన లభించింది. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
0 కామెంట్లు