క్రికెటర్ శ్రీచరణికి రూ. 2.5 కోట్లు, గ్రూప్-1 జాబ్!

surya
By -

మహిళల వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో మెరిసిన తెలుగమ్మాయి, క్రికెటర్ శ్రీచరణిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన ఆమెకు భారీ నజరానా ప్రకటించింది.


క్రికెటర్ శ్రీచరణికి రూ. 2.5 కోట్లు


శ్రీచరణికి రూ. 2.5 కోట్లు, గ్రూప్-1 జాబ్!

ప్రపంచకప్ గెలిచిన శ్రీచరణికి రూ. 2.5 కోట్ల భారీ నగదు బహుమతి, గ్రూప్-1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

అంతేకాకుండా, ఆమె సొంత జిల్లా కడపలో 1,000 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ఏపీ సీఎంఓ (CMO) అధికారికంగా ట్వీట్ చేసింది.


మంత్రి లోకేశ్ ప్రత్యేక అభినందన

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా 'ఎక్స్' వేదికగా స్పందించారు. "శ్రీచరణి అచంచల అంకితభావం ఆంధ్రప్రదేశ్‌ను గర్వపడేలా చేసింది. ఆమె అద్భుత విజయాన్ని ప్రభుత్వం ఈ సత్కారాలతో గుర్తిస్తోంది" అని ఆయన పోస్ట్ చేశారు.


సీఎం చంద్రబాబుతో శ్రీచరణి భేటీ

అంతకుముందు, శ్రీచరణి మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు.. శ్రీచరణిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రపంచకప్ గెలిచి దేశానికి గర్వకారణంగా, ఎంతో మంది మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఈ భేటీలో శ్రీచరణి ప్రపంచకప్ ఆనంద క్షణాలను వారితో పంచుకున్నారు.


కుటుంబ ప్రోత్సాహమే నా బలం: శ్రీచరణి

ఈ సత్కారంపై శ్రీచరణి ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచకప్ గెలిచిన తర్వాత దేశ ప్రజలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారు చూపిస్తున్న అభిమానానికి చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

తన కుటుంబం అందించిన ప్రోత్సాహమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని, ముఖ్యంగా తన మామ తనను క్రికెట్ ఆడేందుకు ఎంతగానో ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు. తాను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో శిక్షణ పొందానని చెప్పారు.


ఇది ఆరంభం మాత్రమే..

ఈ విజయం మొదటి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని లక్ష్యాలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు, ఆయన భవిష్యత్ కార్యాచరణపై విలువైన సలహాలు ఇచ్చారని పేర్కొన్నారు.


కడపలో భారీ సన్మానం

కాగా, ఇవాళ సాయంత్రం కడపలో ఏసీఏ, కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీచరణికి భారీ ర్యాలీ, సన్మాన కార్యక్రమం నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.