జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, శుక్రవారం నాటి ప్రెస్ మీట్లో బీఆర్ఎస్, బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
"బ్యాడ్ బ్రదర్స్" అభివృద్ధిని అడ్డుకుంటున్నారు
"కిషన్ రెడ్డి, కేటీఆర్.. ఈ 'బ్యాడ్ బ్రదర్స్' ఇద్దరూ కలిసి మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు" అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పీజేఆర్, శశిధర్ రెడ్డి లాంటి వారు "హైదరాబాద్ బ్రదర్స్"గా నగరాన్ని అభివృద్ధి చేస్తే, ఈ "బ్యాడ్ బ్రదర్స్" అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.
కేటీఆర్ వల్లే గంజాయి, డ్రగ్స్.. 111 జీవోలో ఫార్మ్ హౌస్లు
"కేటీఆర్ నగరానికి తెచ్చిన గొప్ప వరం గంజాయి, డ్రగ్స్" అని రేవంత్ ఎద్దేవా చేశారు. నగరాన్ని డ్రగ్స్ అడ్డాగా మార్చారని, 111 జీవో పరిధిలో ఫార్మ్ హౌస్లు కట్టుకున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. పదేళ్లలో కేసీఆర్ ఏం చేశారో చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు.
మూసీ ప్రక్షాళనకు కిషన్ రెడ్డి అడ్డం
ఎంఐఎం సహకరిస్తుండటం వల్లే పాతబస్తీలో మెట్రో, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయన్నారు. "యమునా నదిని, గుజరాత్లో నదులను శుద్ధి చేయొచ్చు, కానీ మూసీ ప్రక్షాళన ఎందుకు వద్దో కిషన్ రెడ్డి చెప్పాలి" అని ఆయన డిమాండ్ చేశారు.
44 చెరువులు కబ్జా చేసింది బీఆర్ఎస్ కాదా?
"కేటీఆర్ అనే వాడు విష పురుగు. 44 చెరువులు బీఆర్ఎస్ వాళ్ళు ఆక్రమించి అమ్మేశారు" అని రేవంత్ ఆరోపించారు. బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. పేదలు ఇబ్బంది పడితే డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని, కానీ చెరువులు కబ్జా చేసిన పెద్దలను వదిలేది లేదని హెచ్చరించారు.
హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు
హరీష్ రావుపై కూడా రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "కేసీఆర్కు అండగా ఉండే వాళ్లను హరీష్ బయటకు పంపించే పనిలో ఉన్నాడు. ఆలె నరేంద్ర నుంచి ఈటల వరకు.. కేసీఆర్కు నమ్మకంగా ఉన్నవాళ్లందరినీ బయటకు పంపాడు" అని విమర్శించారు.
"పదేళ్లు అండగా ఉండండి, తెలంగాణ అభివృద్ధి చూపిస్తా. గంజాయి, డ్రగ్స్ వాడితే తొక్కి నారా తీస్తా" అని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. "కోవిడ్ డొనేషన్లను కూడా మింగారు" అని గత ప్రభుత్వంపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడిని మరింత పెంచాయి.
