గమ్యం చేరాల్సిన బస్సు.. స్మశానవాటికలా మారింది. ప్రయాణం ప్రాణాంతకంగా మారింది. తెల్లవారుజామున అందరూ ఆదమరిచి నిద్రపోతున్న వేళ, మంటలు చుట్టుముట్టడంతో ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కర్ణాటకలో జరిగిన బస్సు ప్రమాదం ప్రతి ప్రయాణికుడిని భయభ్రాంతులకు గురిచేస్తోంది.
కర్ణాటక (Karnataka)లోని చిత్రదుర్గ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి శివమొగ్గకు 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. హిరియూర్ సమీపంలోని హెబ్బులి హైవేపై గోర్లట్టు వద్దకు రాగానే.. ఎదురుగా వచ్చిన లారీ బస్సును బలంగా ఢీకొట్టింది.
గాఢ నిద్రలో ఉండగానే..
సమయం తెల్లవారుజామున 3 గంటలు. బస్సులోని ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. లారీ ఢీకొట్టిన ధాటికి బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
సజీవ దహనం: నిమిషాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. నిద్రలో ఉన్న ప్రయాణికులకు కనీసం సీట్ల నుంచి లేచే అవకాశం కూడా దొరకలేదు. ఈ ఘోర ప్రమాదంలో 10 మంది మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైనట్లు ప్రాథమిక సమాచారం.
గుర్తుపట్టలేనంతగా: మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో.. చనిపోయింది ఎవరో గుర్తించడం కూడా పోలీసులకు, కుటుంబ సభ్యులకు కష్టంగా మారింది.
మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్..
అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పినప్పటికీ అప్పటికే బస్సు అస్థిపంజరంలా మిగిలింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
వాస్తవం ఏంటంటే..
రాత్రి ప్రయాణాలు ఎంత సౌకర్యంగా ఉంటాయో, అంతే ప్రమాదకరంగా మారుతున్నాయి అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు గమ్యస్థానాలకు త్వరగా చేర్చాలనే అత్యుత్సాహంతో పరిమితికి మించిన వేగంతో వెళ్లడం, డ్రైవర్ల నిర్లక్ష్యం లేదా నిద్రలేమి ఇలాంటి ఘోరాలకు ప్రధాన కారణమవుతున్నాయి. మనం టికెట్ కొనుక్కుంటున్నాం అంటే ప్రాణాలకు భరోసా కొనుక్కుంటున్నామని అర్థం. కానీ యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేయడం వల్ల అమాయక ప్రయాణికులు మూల్యం చెల్లించుకుంటున్నారు.
మరోవైపు బస్సుల్లో భద్రతా ప్రమాణాల డొల్లతనం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు మంటలు ఇంత వేగంగా వ్యాపించడానికి కారణం నాసిరకం మెటీరియల్స్ వాడటమా? లేక ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ (Emergency Exits) సులభంగా తెరుచుకోకపోవడమా? అనేది ఆలోచించాలి. ప్రయాణికులు నిద్రలో ఉన్నప్పుడు ప్రమాదం జరిగితే కనీసం అప్రమత్తం చేసే స్మోక్ అలారమ్స్ కానీ, ఆటోమేటిక్ డోర్ ఓపెనింగ్ సిస్టమ్స్ కానీ మన బస్సుల్లో ఉండవు. ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు తూతూమంత్రం తనిఖీలు కాకుండా, కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటివి ఆగుతాయి. లేదంటే రోడ్లపై ప్రయాణం ఎప్పుడూ నరకమే.
Horrible accident Near Hiriyur along Bengaluru Hubballi highway, sleeper bus caught fire, 30+ feared dead! .#Busfire #chitradurga #karnataka pic.twitter.com/Fdpe5Tg999
— Naik Kartik (@mekartiknaik) December 24, 2025

