మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణించిన విమానం కుప్పకూలిన ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. అయితే, కేవలం రన్వేకు 100 అడుగుల దూరంలో ఉండగా ఈ ఘోరం ఎలా జరిగింది? విమానం కూలడానికి సరిగ్గా 12 నిమిషాల ముందు సిగ్నల్స్ ఎందుకు ఆగిపోయాయి? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పిన ఒక్క పదం సమాధానం ఇస్తోంది. అదే 'రీడ్బ్యాక్' (Readback). అసలు ఏంటీ రీడ్బ్యాక్? అనుభవజ్ఞురాలైన పైలట్ శాంభవి పాఠక్ ఆ కీలక సమయంలో ఎందుకు స్పందించలేదు? కాక్ పిట్ లో జరిగిన ఆ చివరి సంభాషణే ఇప్పుడు ప్రమాదానికి అసలు కారణమా?
అసలేంటీ 'రీడ్బ్యాక్'? ఎందుకు అంత ముఖ్యం?
విమానయాన రంగంలో 'రీడ్బ్యాక్' అనేది ఒక ప్రాణవాయువు లాంటి ప్రొటోకాల్. ఏటీసీ (Air Traffic Control) అధికారులు ఏదైనా ఆదేశం ఇచ్చినప్పుడు, పైలట్లు దానిని విన్నామని నిర్ధారిస్తూ మళ్లీ చదివి వినిపించడాన్నే రీడ్బ్యాక్ అంటారు. ఇది కేవలం సందేశం కాదు.. పైలట్ మరియు ఏటీసీ మధ్య ఉన్న సమన్వయానికి నిదర్శనం. ఏ రన్వేలో దిగాలి? గాలి వేగం ఎంత ఉంది? ఎత్తు ఎంత తగ్గించాలి? అనే విషయాల్లో క్లారిటీ ఉండాలంటే రీడ్బ్యాక్ తప్పనిసరి. కానీ, అజిత్ పవార్ ప్రయాణించిన విమానంలో పైలట్ శాంభవి పాఠక్ ఆ కీలక సమయంలో రీడ్బ్యాక్ ఇవ్వలేదని మంత్రి వెల్లడించడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఆఖరి క్షణాల్లో గందరగోళం.. 'గో-అరౌండ్' తర్వాతే ప్రమాదం
ప్రమాదానికి ముందు బారామతి గగనతలంలో ఉత్కంఠ నెలకొంది. వాతావరణం సరిగ్గా లేకపోవడంతో "రన్వే కనిపిస్తుందా?" అని ఏటీసీ అధికారులు పైలట్లను అడిగారు. దానికి "కనిపించడం లేదు" అని పైలట్లు బదులిచ్చారు. దీంతో విమానం ల్యాండ్ అవ్వకుండా గాల్లోనే చక్కర్లు (Go-around) కొట్టింది. రెండోసారి ప్రయత్నించినప్పుడు రన్వే కనిపిస్తోందని పైలట్లు చెప్పడంతో, ఏటీసీ ల్యాండింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్లియరెన్స్ ఇచ్చిన కాసేపటికే విమానం కుప్పకూలింది. అయితే ఈ ప్రాసెస్ లో పైలట్ శాంభవి నుంచి రావాల్సిన 'రీడ్బ్యాక్' రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
12 నిమిషాల ముందు సిగ్నల్ కట్!
మరో ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. ప్రమాదానికి 12 నిమిషాల ముందే విమానం నుంచి ఏడీఎస్-బీ (ADS-B) సిగ్నల్స్ ఆగిపోయాయి. విమానం ఎక్కడ ఉంది? ఎంత ఎత్తులో ఉంది? అనే సమాచారాన్ని ఇవి ఎప్పటికప్పుడు గ్రౌండ్ స్టేషన్ కు చేరవేస్తాయి. సరిగ్గా ల్యాండింగ్ కు సిద్ధమవుతున్న సమయంలోనే ఈ సిగ్నల్స్ నిలిచిపోవడం సాంకేతిక వైఫల్యమా? లేక మానవ తప్పిదమా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
అనుభవజ్ఞురాలే.. కానీ విధి చిన్నచూపు
ఈ విమానాన్ని నడిపిన పైలట్ శాంభవి పాఠక్ సామాన్యురాలేమీ కాదు. న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ పైలట్ అకాడమీలో శిక్షణ పొందిన ఆమె.. డీజీసీఏ (DGCA) నుంచి లైసెన్స్ పొందిన నిష్ణాతురాలు. కొత్త పైలట్లకు శిక్షణ ఇచ్చే ఇన్స్ట్రక్టర్గా కూడా పనిచేశారు. 2022 నుంచి వీఎస్ఆర్ వెంచర్స్ లో ఫుల్ టైమ్ ఫస్ట్ ఆఫీసర్ గా చేస్తున్నారు. ఇంతటి అనుభవం ఉన్న పైలట్ కూడా వాతావరణం, సాంకేతిక సమస్యల ముందు తలవంచక తప్పలేదు.
ఒక్క కమ్యూనికేషన్ గ్యాప్.. ఐదు ప్రాణాలు !
టెక్నాలజీ ఎంత పెరిగినా, పైలట్లకు ఎంత అనుభవం ఉన్నా.. ఏటీసీతో కమ్యూనికేషన్ లో చిన్న లోపం జరిగినా మూల్యం భారీగా ఉంటుంది. 'రీడ్బ్యాక్' ఇవ్వకపోవడం చిన్న విషయమే అనిపించొచ్చు, కానీ అదే ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది.

