మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) మరణం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. అయితే ఈ ప్రమాదం వెనుక అసలు కారణం ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ తొలుస్తోంది. ఆయన ప్రయాణించిన 'లియర్ జెట్-45' (Learjet-45) మోడల్ విమానంపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. గతంలోనూ ఇదే మోడల్ విమానం క్రాష్ ల్యాండ్ అయిన చరిత్ర ఉండటంతో.. ఇది టెక్నికల్ ఫెయిల్యూరా? లేక వాతావరణం దెబ్బకొట్టిందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. దీనిపై విమానయాన సంస్థ యజమాని, పౌర విమానయాన మంత్రి భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది?
ఆ విమానాలపై ఎందుకంత డౌట్?
అజిత్ పవార్ ప్రయాణించిన విమానం వీఎస్ఆర్ ఏవియేషన్ (VSR Aviation) సంస్థకు చెందినది. అయితే ఈ 'లియర్ జెట్-45' మోడల్ కు ఒక బ్యాడ్ ట్రాక్ రికార్డ్ ఉంది. 2023లో కూడా ఇదే మోడల్ విమానం ముంబయి విమానాశ్రయంలో క్రాష్ ల్యాండ్ అయ్యింది. దీంతో ఈ విమానాల భద్రతపై, వీఎస్ఆర్ సంస్థ పనితీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెక్నికల్ గా లోపాలున్న విమానాలను వీవీఐపీల కోసం ఎందుకు వాడుతున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విమానం ఫిట్.. పైలట్లు హిట్: యజమాని వీకే సింగ్
విమర్శల నేపథ్యంలో వీఎస్ఆర్ ఏవియేషన్ యజమాని వీకే సింగ్ (VK Singh) మీడియా ముందుకొచ్చారు. ప్రమాదానికి గురైన విమానంలో ఎలాంటి సాంకేతిక సమస్య లేదని స్పష్టం చేశారు. "మా విమానాల ఫిట్నెస్ ను ఎప్పటికప్పుడు పరీక్షిస్తాం. విమానం ఫిట్ గా ఉన్నప్పుడు గ్రౌండ్ చేయాల్సిన అవసరం ఏముంది?" అని ఎదురుప్రశ్నించారు. పైలట్ల అనుభవం గురించి చెబుతూ.. కెప్టెన్ సుమిత్ కపూర్ కు 16,000 గంటల అనుభవం, కో-పైలట్ శాంభవి పాఠక్ కు 1,500 గంటల అనుభవం ఉందని, వారు ఎక్స్ పర్ట్స్ అని వెల్లడించారు. మిగతా విమానాలను నిలిపివేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
మంత్రి వెర్షన్ వేరు.. కారణం 'విజిబులిటీ'!
ఓవైపు సంస్థ యజమాని విమానం బాగుందని చెబుతుంటే.. మరోవైపు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) ప్రమాదానికి వాతావరణమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో బారామతి ఎయిర్ పోర్టులో విజిబులిటీ (Visibility) చాలా తక్కువగా ఉందని తెలిపారు. దట్టమైన పొగమంచు లేదా ఇతర కారణాల వల్ల రన్ వే సరిగ్గా కనిపించలేదని, ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా ఈ ఘోరం జరిగిందని వెల్లడించారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపిస్తామని, నిజానిజాలు నిగ్గు తేలుస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
టెక్నాలజీ ఓడిందా? ప్రకృతి గెలిచిందా?
పైలట్లకు వేల గంటల అనుభవం ఉన్నా, విమానం కండిషన్ లో ఉన్నా.. వాతావరణం అనుకూలించకపోతే ఎంతటి ప్రమాదమైనా జరగొచ్చని ఈ ఘటన నిరూపిస్తోంది. పూర్తి దర్యాప్తు నివేదిక వస్తే గానీ అసలు నిజం బయటపడదు.

