"సోషల్ మీడియా (Social Media) పిల్లలను పాడుచేస్తోందా? 16 ఏళ్ల లోపు వాళ్లకు బ్యాన్ పెట్టాలా?" ఇప్పుడు దేశం మొత్తం ఇదే చర్చ. ఆస్ట్రేలియా బాటలో మనమూ వెళ్లాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. కానీ, ఈ నిర్ణయం "ఆత్మహత్యాసదృశం" అంటున్నారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma). బ్యాన్ పెడితే మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడలేరని, వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆయన ఎందుకు హెచ్చరిస్తున్నారు? వర్మ లాజిక్ ఏంటి?
కాలక్షేపం కాదు.. జ్ఞాన భాండాగారం!
ఆర్జీవీ (RGV) తనదైన శైలిలో ఈ విషయంపై స్పందించారు. సోషల్ మీడియా అంటే కేవలం రీల్స్, మీమ్స్ మాత్రమే కాదు. అది అనంతమైన జ్ఞానానికి వేదిక అని ఆయన గుర్తుచేశారు. "ఇతర దేశాల్లోని పిల్లలు రెడ్డిట్ (Reddit), యూట్యూబ్ (YouTube) లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా కోడింగ్, రాకెట్ సైన్స్ నేర్చుకుంటున్నారు. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్నారు. మనం ఇక్కడ తలుపులు మూసేస్తే ఎలా?" అని ఆయన ప్రశ్నించారు.
పోటీలో మన పిల్లలు వెనుకబడిపోతారు..
రక్షణ పేరుతో పిల్లలకు ఇన్ఫర్మేషన్ అందకుండా చేస్తే.. అంతిమంగా నష్టపోయేది మనమేనని వర్మ అభిప్రాయపడ్డారు. డిజిటల్ ప్రపంచంపై పట్టు లేకపోతే రేపటి రోజున కెరీర్ ఉండదు. "మనం భయపడి టెక్నాలజీని దూరం చేస్తే.. మన పిల్లల జీవితాలను మన చేతులారా నాశనం చేసిన వాళ్లమవుతాం. గ్లోబల్ కాంపిటీషన్ లో వాళ్ళు వెనుకబడిపోతారు" అని వర్మ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
కొందరి కోసం అందరినీ శిక్షిస్తారా?
ఎవరో కొందరు తప్పు చేశారని, లేదా దారి తప్పారని మొత్తం టెక్నాలజీనే నిషేధించడం సరికాదని వర్మ చెప్పారు. "కత్తితో పండు కోయొచ్చు, ప్రాణం తీయొచ్చు.. అంతమాత్రాన కత్తులను బ్యాన్ చేస్తామా?" అనే లాజిక్ ఆయన వాదనలో వినిపిస్తోంది. సోషల్ మీడియాను ఎలా వాడాలో నేర్పించాలి తప్ప.. అందకుండా దాచడం పరిష్కారం కాదని, అలా చేస్తే పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందని తేల్చిచెప్పారు.
భయం పరిష్కారం కాదు.. బాధ్యతే ముఖ్యం!
నిప్పుతో ఆడుకుంటే కాలుతుందని తెలిసి కూడా నిప్పును వాడుతున్నాం.. ఎందుకంటే అది అవసరం. సోషల్ మీడియా కూడా అంతే. బ్యాన్ చేయడం అంటే కళ్లు మూసుకుని ప్రపంచం చీకటి అనుకోవడమే!

