పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. "మా జోలికొస్తే ఊరుకోం.. ప్రాంతీయ యుద్ధం తప్పదు" అని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Khamenei) హెచ్చరిస్తే.. "నీ మాటలు నిజమో కాదో రెండు రోజుల్లో తేల్చేస్తా" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఫ్లోరిడా నుంచి ట్రంప్ ఇచ్చిన ఈ వార్నింగ్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు మోహరించి ఉన్న వేళ.. అసలు ఆ 'రెండు రోజుల్లో' ఏం జరగబోతోంది?
ఖమేనీ వార్నింగ్.. ప్రాంతీయ యుద్ధం తప్పదు!
అమెరికా తమపై దాడికి దిగితే చూస్తూ ఊరుకోబోమని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా దాడి చేస్తే.. అది కేవలం ఇరాన్ తో ఆగదని, పశ్చిమాసియా (West Asia) మొత్తం ప్రాంతీయ యుద్ధంలో చిక్కుకుంటుందని హెచ్చరించారు. అమెరికా యుద్ధ నౌకలను చూసి తాము భయపడబోమని, తమ జోలికొస్తే గట్టిగా బుద్ధి చెబుతామని ఖమేనీ తనదైన శైలిలో అమెరికాకు సందేశం పంపారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఖమేనీ ఇంత సూటిగా హెచ్చరించడం ఇదే తొలిసారి.
ట్రంప్ కౌంటర్.. 'డీల్' కుదరకపోతే అంతే!
ఖమేనీ వ్యాఖ్యలపై ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. "ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మా యుద్ధ నౌకలు మీకు చాలా దగ్గరగా ఉన్నాయి" అని గుర్తు చేశారు. అయితే ఇక్కడే ట్రంప్ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
"రెండు రోజుల్లో ఏదో ఒక ఒప్పందం (Deal) కుదరొచ్చని నేను అనుకుంటున్నా."
"ఒకవేళ డీల్ కుదరకపోతే.. అప్పుడు ఖమేనీ చెప్పింది నిజమో, కాదో తేలిపోతుంది." అంటే.. మాట వింటే డీల్.. లేదంటే వార్ అని ట్రంప్ పరోక్షంగా అల్టిమేటం జారీ చేశారు.
ఉద్రిక్తత పీక్స్.. ప్రపంచం చూపు ఇటువైపే
ఇద్దరు అగ్రనేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో పశ్చిమాసియా అగ్నిగుండంలా మారింది. ఒకపక్క ఇరాన్ వెనక్కి తగ్గేది లేదంటుంటే.. మరోపక్క ట్రంప్ తన సైనిక శక్తిని చూపిస్తున్నారు. రాబోయే 48 గంటలు అత్యంత కీలకం కానున్నాయి. ఈ సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది భీకర యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది.
48 గంటల్లో తేలిపోతుంది!
ట్రంప్ మాటల్లోని ధీమా చూస్తుంటే.. తెరవెనుక ఏదో పెద్ద చర్చ జరుగుతున్నట్లుంది. అది సఫలమైతే శాంతి.. విఫలమైతే అశాంతి!

