'మేడ్ ఇన్ చైనా' వస్తువులు ఎప్పుడు పనిచేస్తాయో, ఎప్పుడు పాడవుతాయో ఎవరికీ తెలియదు. మన ఇళ్లలో వాడే చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులకే గ్యారెంటీ లేనప్పుడు.. ఏకంగా దేశ భద్రతను కాపాడే క్షిపణులను చైనా నుంచి కొంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఇరాన్ కు ఇప్పుడు ప్రాక్టికల్గా అర్థమైంది. శనివారం (ఫిబ్రవరి 28) అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోవడానికి పరోక్షంగా చైనా డబ్బా టెక్నాలజీనే కారణమా? ఒక సామాన్యుడిగా ఈ 'డ్రాగన్' ఆయుధాల వైఫల్యం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? దీనివల్ల భవిష్యత్తులో మన దేశ భద్రతకు ఎంత ప్లస్సో చూద్దాం.
కాగితాల మీదే చైనా క్షిపణుల పవర్!
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు భీకర వైమానిక దాడులు చేసి 28 ప్రావిన్సులను ధ్వంసం చేశాయి. ఈ దాడులను అడ్డుకోవడంలో చైనాకు చెందిన 'HQ-9B' ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దారుణంగా విఫలమైంది.
గతంలో (2025లో) రష్యాకు చెందిన S-300 సిస్టమ్ విఫలమవ్వడంతో.. చమురు ఇచ్చి మరీ బార్టర్ సిస్టమ్లో చైనా నుంచి ఈ HQ-9B వ్యవస్థను ఇరాన్ కొనుగోలు చేసింది. నాటాంజ్ అణు సముదాయం, సైనిక స్థావరాల వద్ద వీటిని మోహరించింది. కానీ తీరా యుద్ధం వచ్చేసరికి ఇవి కనీసం శత్రువుల క్షిపణులను గాలిలో ట్రాక్ కూడా చేయలేకపోయాయి.
ఆపరేషన్ సిందూర్లోనూ తుస్సుమన్న డ్రాగన్!
చైనా సొంతంగా తయారుచేసిన ఈ HQ-9B కి 260 కి.మీ రేంజ్ ఉందని, ఒకేసారి 100 లక్ష్యాలను ట్రాక్ చేయగలదని చైనా గొప్పలు చెప్పుకుంది. కానీ ప్రాక్టికల్ గా అదంతా ఫేక్ అని తేలిపోయింది.
ఇది ఫెయిల్ అవ్వడం ఇదే తొలిసారి కాదు. భారత సైన్యం చేసిన 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) సమయంలోనూ ఈ చైనా రక్షణ వ్యవస్థను మన ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా చిత్తు చేసింది. ఇప్పుడు రెండోసారి ఇరాన్ గడ్డపై ఈ సిస్టమ్ అట్టర్ ఫ్లాప్ కావడంతో చైనా టెక్నాలజీపై ప్రపంచ దేశాలు నవ్వుకుంటున్నాయి.
ఇరాన్ ప్రతీకారం.. మిడిల్ ఈస్ట్లో మంటలు
నమ్మిన చైనా రక్షణ వ్యవస్థ మోసం చేయడంతో సుప్రీం లీడర్ ఖమేనీని కోల్పోయిన ఇరాన్, ఇప్పుడు తీవ్ర ప్రతీకార దాడులకు దిగుతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడుతోంది.
బీజింగ్, టిబెట్, దక్షిణ చైనా సముద్రం లాంటి కీలక ప్రాంతాల్లో చైనా కూడా రక్షణ కోసం ఇదే HQ-9B సిస్టమ్ ను వాడుతోంది. అంటే, డ్రాగన్ దేశం సొంత రక్షణ కూడా గాల్లో దీపమేనని ఈ ఘటనతో అర్థమవుతోంది.
భారత్కు ఇది 'డబుల్' గుడ్ న్యూస్!
చైనా ఆయుధాలు యుద్ధభూమిలో పనిచేయవని ప్రపంచానికి మరోసారి ప్రూవ్ అవ్వడం భారత్ కు అతిపెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే, మన దాయాది పాకిస్థాన్ తన సైనిక బలం కోసం దాదాపు 80% చైనా ఆయుధాల పైనే ఆధారపడి ఉంది. రేపు ఏదైనా యుద్ధం వస్తే పాకిస్థాన్ వాడే చైనా మిస్సైల్స్ గాల్లోనే పేలిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. మన పటిష్టమైన రక్షణ వ్యవస్థ ముందు చైనా ప్లాస్టిక్ ఆయుధాలు నిలబడవని ఈ ఘటన ప్రతి సామాన్య భారతీయుడికి కొండంత ధైర్యాన్ని ఇస్తోంది!

