రక్తపాతం, బాంబుల మోతతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. తుపాకుల స్థానంలో మాటల తూటాలు పేలుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ భీకర సమరం ఇప్పుడు అత్యంత భయంకరమైన మానసిక యుద్ధంగా మారి యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. యుద్ధ క్షేత్రంలో గల్లంతైన తన ప్రాణసమానమైన కొడుకు కోసం ఓ అమెరికన్ తల్లి సోషల్ మీడియా వేదికగా కన్నీటి పర్యంతమవుతూ చేసిన పోస్ట్.. ఇప్పుడు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన అగ్గి రాజేసింది.
కన్నీరుపెట్టిన కన్నతల్లి..
గత శుక్రవారం ఇరాన్ గడ్డపై అమెరికాకు చెందిన రెండు ఎఫ్-15 యుద్ధ విమానాలను ఇరాన్ రక్షణ బలగాలు అత్యంత దారుణంగా నేలకూల్చిన సంగతి తెలిసిందే. ఈ హృదయ విదారక ఘటనపై గల్లంతైన ఓ అమెరికన్ ఫైటర్ పైలట్ తల్లి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
"కూలిపోయిన ఆ రెండు ఎఫ్-15 విమానాల్లో ఉన్న పైలట్ల ప్రాణాల కోసం దయచేసి ప్రార్థించండి. నా కన్న కొడుకు కూడా ఒక ఫైటర్ పైలట్. అతడు, అతడి యూనిట్ ఎక్కడున్నారో, ఏమయ్యారో ఇప్పటి వరకు నాకు ఎలాంటి సమాచారమూ అందలేదు. నా గుండె తీరని ఆందోళనతో బరువెక్కిపోయింది" అంటూ ఆమె చేసిన భావోద్వేగపూరితమైన పోస్ట్ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.
ఇరాన్ మైండ్ గేమ్.. ట్రంప్ వల్లే ముప్పు!
ఆ కన్నతల్లి ఆవేదనకు ఇరాన్ దౌత్య కార్యాలయం ఇచ్చిన రిప్లై ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో పెను సంచలనంగా మారింది. పాకిస్థాన్లోని ఇరాన్ ఎంబసీ నేరుగా స్పందిస్తూ అగ్రరాజ్యానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. "మీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రక్షణలో ఉండటం కంటే, మాకు బందీలుగా ఉండటమే మీ కుమారులకు అత్యంత సురక్షితం. మీ వాడు అమెరికన్ రెస్క్యూ టీమ్లకు దొరకడం కంటే.. మా చేతికి ప్రాణాలతో చిక్కాలని దేవుడ్ని కోరుకోండి" అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చింది.
ముస్లింలుగా, నాగరికత కలిగిన ఇరానియన్లుగా యుద్ధ ఖైదీలను ఎలా గౌరవించాలో తమకు బాగా తెలుసని, ట్రంప్ వల్లే మీ బిడ్డల ప్రాణాలకు అసలైన ముప్పని ఇరాన్ వ్యాఖ్యానించింది.
రాతి యుగపు మనుషులం కాదు..
ఈ మానసిక యుద్ధం ఇక్కడితో ఆగిపోలేదు. దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ కూడా పాకిస్థాన్ ఎంబసీ చేసిన వ్యాఖ్యలను బలంగా సమర్థించింది. తాము అమెరికా లేదా ఇజ్రాయెల్ దేశాల్లాగా రాతి యుగపు మనుషులం కాదని ఎద్దేవా చేస్తూ ఇరాన్ చేసిన కామెంట్లు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో కాక రేపుతున్నాయి.
శత్రు దేశం సైనికులను కూడా మానవత్వంతో చూస్తామని ఇరాన్ చెబుతున్న ఈ మాటలు అమెరికా రక్షణ వ్యవస్థకే అతిపెద్ద సవాల్గా మారాయి.
ఆరో వారానికి మారణహోమం.. గల్లంతైన పైలట్ ఎక్కడ?
గత ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తర్వాత మొదలైన ఈ భయంకరమైన యుద్ధం.. ఇప్పుడు ఆరో వారానికి చేరుకుని మరింత తీవ్ర రూపం దాల్చింది. శుక్రవారం జరిగిన దాడుల్లో కూలిపోయిన విమానాల నుంచి అమెరికా ఒక పైలట్ను అతి కష్టం మీద రక్షించగా.. మరొకరు ఎక్కడున్నారో తెలియక గల్లంతయ్యారు.
ఇప్పటికీ ఆ సైనికుడి ఆచూకీ లభించకపోవడంతో అతడిని ఎలాగైనా వెతికి పట్టుకునేందుకు అమెరికా బలగాలు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు, ఆ అమెరికన్ పైలట్ను తమకు బందీగా పట్టుకోవడానికి ఇరాన్ సైన్యం కూడా విపరీతంగా కష్టపడుతోంది.
వణుకుతున్న గల్ఫ్ దేశాలు.. నెత్తురోడుతున్న పశ్చిమాసియా
ఈ యుద్ధ మేఘాలు కేవలం ఇరాన్, అమెరికాలకే పరిమితం కాలేదు. ఇరాన్ చేస్తున్న భీకర వైమానిక దాడుల ధాటికి బహ్రెయిన్, సౌదీ అరేబియా, యూఏఈలలో కూడా ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటించాయి.
యుద్ధం మొదలైనప్పటి నుంచి నేటి వరకు ఈ నెత్తుటి క్రీడలో దాదాపు 1,900 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల జాబితాలో 13 మంది అమెరికా సైనికులు, 19 మంది ఇజ్రాయెల్ పౌరులు ఉండగా.. మిగతా వారంతా ఇరానీయన్లే కావడం గమనార్హం.
సామ్రాజ్య విస్తరణ, ఆధిపత్య పోరులో అగ్రరాజ్యాలు ఆడుతున్న ఈ నెత్తుటి చదరంగంలో.. బిడ్డలను కోల్పోయిన కన్నతల్లుల కన్నీటికి కచ్చితంగా కాలమే కఠినమైన తీర్పు చెబుతుంది!
Also Read:
India Pakistan War : పాకిస్థాన్ కవ్వింపులు.. కోల్కతాపై గురి!ఇరాన్ అణు కేంద్రం వద్ద క్షిపణి దాడి.. దద్దరిల్లిన ప్రపంచం!
ప్రాణం పోతున్నా పక్కవారి కోసం పరితపించిన యువతి.. హృదయాన్ని కదిలించే కథ
ఇరాన్లో అమెరికా ఎఫ్-15 కూల్చివేత: మిస్సయిన పైలట్ కోసం వేట
పాకిస్థాన్లో పెట్రోల్ మంటలు: దిగొచ్చిన షెహబాజ్ సర్కార్!

