పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. నెత్తుటి కూపంగా మారిన ఈ పోరు ఆరో వారానికి చేరుకున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన '48 గంటల డెడ్లైన్' ఇప్పుడు ప్రపంచ దేశాల గుండెల్లో గుబులు రేపుతోంది. కేవలం రెండు రోజుల్లోగా శాంతి ఒప్పందానికి తలొగ్గకపోతే ఇరాన్ జాతీయ ఆస్తులను, మౌలిక సదుపాయాలను నామరూపాలు లేకుండా సర్వనాశనం చేస్తామని ట్రంప్ చేసిన భీకర హెచ్చరికలు కల్లోలం సృష్టిస్తున్నాయి. కానీ, ట్రంప్ విధించిన ఈ తాజా అల్టిమేటంపై ఏమాత్రం వెనక్కి తగ్గని ఇరాన్ అత్యంత ఘాటుగా స్పందించింది. ట్రంప్ వార్నింగ్ను బేఖాతరు చేస్తూ అదొక "అసంబద్ధమైన, పరమ మూర్ఖత్వపు చర్య" అని ముఖం మీదే కొట్టిపారేసింది.
నరకపు ద్వారాలు తెరుస్తాం.. జనరల్ వార్నింగ్!
Iran Warns US Of Opening Gates Of Hell After Trump 48 Hour Ultimatum : ఇరాన్ ఖాతమ్ అల్ అన్బియా సెంట్రల్ హెడ్క్వార్టర్స్ ప్రతినిధి, జనరల్ అలీ అబ్దుల్లాహి అలీబాదీ అమెరికాకు సూటిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అగ్రరాజ్యం గనక ఏమాత్రం దుస్సాహసానికి ఒడిగట్టినా ఊహించని భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
"ఒకవేళ మా దేశ ఆస్తులపై మీరు దాడులు చేస్తే.. మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఇజ్రాయెల్ మౌలిక సదుపాయాలపై నిరంతరాయంగా విధ్వంసకర దాడులు విరుచుకుపడతాయి. అదే జరిగితే మీకు నరకపు ద్వారాలు తెరుచుకున్నట్లే" అని ఆయన సింహగర్జన చేశారు.
ఫెయిల్యూర్స్ కప్పిపుచ్చుకునేందుకే పిచ్చి ప్రేలాపనలు
క్షేత్రస్థాయిలో వరుసగా ఎదురవుతున్న సైనిక వైఫల్యాలు, నిరాశతోనే ట్రంప్ ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని అలీ అబ్దుల్లాహి తీవ్రంగా ఎద్దేవా చేశారు. తమ దేశ హక్కులను కాపాడుకోవడానికి, జాతీయ ఆస్తులను కంటికి రెప్పలా రక్షించుకోవడానికి ఇరాన్ సాయుధ దళాలు ఒక్క క్షణం కూడా వెనుకాడబోవని.. తమపైకి వచ్చే దురాక్రమణదారులకు తగిన బుద్ధి చెబుతామని ఆయన స్పష్టం చేశారు.
ఇరాన్ తన పక్కా ప్రణాళికలు, లక్ష్యాల జాబితా ప్రకారంగానే శత్రువులపై దాడులు కొనసాగిస్తోందని, త్వరలోనే అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఊహించని గట్టి ఎదురుదెబ్బ తగలనుందని మరో ఇరాన్ భద్రతాధికారి కుండబద్దలు కొట్టారు.
అణు కేంద్రంపై క్షిపణులు.. రేడియోధార్మిక ముప్పు!
ఇదిలా ఉంటే శనివారం జరిగిన దాడుల్లో ఇరాన్లోని అత్యంత కీలకమైన బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో క్షిపణులు పడటం తీవ్ర కలకలం రేపింది. దీంతో పెను ప్రమాదాన్ని పసిగట్టిన అధికారులు అక్కడి 198 మంది కార్మికులను ప్రాణాలతో అత్యవసరంగా ఖాళీ చేయించారు.
దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తీవ్రంగా స్పందించారు. అణు ప్లాంట్పై దాడులు ఇలాగే కొనసాగితే రేడియోధార్మిక కాలుష్యం వెలువడి మహా వినాశనం జరుగుతుందని హెచ్చరించారు. ఆ కాలుష్యం టెహ్రాన్ కంటే ఎక్కువగా కువైట్, బహ్రెయిన్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల రాజధానులనే శాశ్వతంగా అంతం చేస్తుందని ఆయన భయాందోళనలు వ్యక్తం చేశారు.
మృత్యుఘోష.. గల్లంతైన పైలట్ ఎక్కడ?
ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమైన ఈ నెత్తుటి యుద్ధంలో శవాల గుట్టలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో ఇరాన్లో ఏకంగా 3,500 మందికి పైగా అమాయకులు, సైనికులు మరణించగా.. ఇజ్రాయెల్లో 19 మంది, అమెరికాకు చెందిన 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
అలాగే ఈ దాడుల్లో ఇరాక్లో కనీసం 108 మంది చనిపోగా.. యూఏఈలో 12 మంది, ఖతార్లో ఏడుగురు, కువైట్లో ఏడుగురు బలైపోయారు. మరోవైపు గత శుక్రవారం ఇరాన్ నేలకూల్చిన అమెరికన్ యుద్ధ విమానంలోని ఒక పైలట్ ఆచూకీ ఇంకా లభించలేదు. ఆ పైలట్ కోసం స్థానిక గిరిజన తెగలు, సైన్యంతో కలిసి సెర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు.
అణు విస్ఫోటన భయాలు, నరకపు ద్వారాల హెచ్చరికల మధ్య.. రాబోయే 48 గంటలు ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించబోయే అత్యంత భయంకరమైన క్షణాలుగా మారనున్నాయి!
Also Read:
US Iran Conflict: అమెరికన్ పైలట్ తల్లికి ఇరాన్ రిప్లైIndia Pakistan War : పాకిస్థాన్ కవ్వింపులు.. కోల్కతాపై గురి!
ఇరాన్ అణు కేంద్రం వద్ద క్షిపణి దాడి.. దద్దరిల్లిన ప్రపంచం!
ప్రాణం పోతున్నా పక్కవారి కోసం పరితపించిన యువతి.. హృదయాన్ని కదిలించే కథ
ఇరాన్లో అమెరికా ఎఫ్-15 కూల్చివేత: మిస్సయిన పైలట్ కోసం వేట

