కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 'కుబేర' చిత్రంలో నటిస్తున్న ధనుష్, సంగీత మాస్ట్రో ఇళయరాజా బయోపిక్లో నటించాల్సి ఉంది. గతేడాది ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే, ఆర్థిక సమస్యల కారణంగా ఆ సినిమా ఆగిపోయిందని సమాచారం. ఇదిలా ఉండగా, ఇప్పుడు ధనుష్ మరో బయోపిక్ చేయనున్నట్లు తెలుస్తోంది. భారత మాజీ రాష్ట్రపతి, ఇస్రో శాస్త్రవేత్త అబ్దుల్ కలాం జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఆయన స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
'కలాం' పేరుతో అబ్దుల్ కలాం బయోపిక్
'కలాం' పేరుతో ఈ సినిమాను రూపొందించనున్నారు. "మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా" అనే ట్యాగ్లైన్తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో మిస్సైల్ మ్యాన్ పాత్రలో కోలీవుడ్ హీరో ధనుష్ కనిపించనున్నారు. కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఓం రౌత్ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్
ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, టీ సిరీస్ సంస్థలు ఈ క్రేజీ ప్రాజెక్టును సంయుక్తంగా నిర్మించనున్నాయి. “రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఒక లెజెండ్ ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇండియన్ మిస్సైల్ మ్యాన్ వెండితెరపైకి వస్తున్నాడు. పెద్దగా కలలు కనండి. మరింత ఎత్తుకు ఎదగండి” అంటూ ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు డైరెక్టర్ ఓం రౌత్.
ఓం రౌత్ రీ-ఎంట్రీ
డైరెక్టర్ ఓం రౌత్ చివరగా ప్రభాస్ హీరోగా నటించిన 'ఆదిపురుష్' సినిమాను రూపొందించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను తెరకెక్కించి విమర్శలు ఎదుర్కొన్నారు డైరెక్టర్ ఓం రౌత్. 'ఆదిపురుష్' సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ ఓం రౌత్, ఇప్పుడు అబ్దుల్ కలాం బయోపిక్ను అధికారికంగా ప్రకటించారు.