భారత క్రికెట్ జట్టు కెప్టెన్, ‘హిట్మ్యాన్’గా పేరొందిన రోహిత్ శర్మ తన కెరీర్కు కీలక మలుపు తిప్పేలా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వెల్లడి చేస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, రోహిత్ శర్మ ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత తన ఎడమ హ్యామ్స్ట్రింగ్కు శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. 2027లో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్కు పూర్తి స్థాయిలో ఫిట్గా ఉండే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం.
హ్యామ్స్ట్రింగ్ సమస్యతో సుదీర్ఘ పోరాటం
గత ఐదేళ్లుగా రోహిత్ శర్మ ఈ హ్యామ్స్ట్రింగ్ సమస్యతో పోరాడుతున్నాడు. భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్గా ఉన్న సమయంలో, అతని బిజీ షెడ్యూల్ కారణంగా సరైన చికిత్సకు అవకాశం దొరకలేదు. అయితే తాజాగా టెస్ట్ క్రికెట్ మరియు టీ20 అంతర్జాతీయ ఫార్మాట్ల నుంచి రిటైరైన నేపథ్యంలో, అతని షెడ్యూల్ కొంత మేర విశ్రాంతిగా మారింది.
ఈ ఆగస్టులో బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత, అక్టోబర్లో ఆస్ట్రేలియాతో తదుపరి వన్డే సిరీస్ వరకు గ్యాప్ లభిస్తోంది. ఈ మధ్యకాలాన్ని సర్జరీ చేయించుకొని, పూర్తిగా కోలుకోవడానికి ఉపయోగించుకోవాలన్నదే రోహిత్ ప్రణాళికగా తెలుస్తోంది.
ఎందుకు ఇప్పుడు? సరైన సమయం ఇదేనా?
ఐపీఎల్ 2025 తర్వాత అంతర్జాతీయ షెడ్యూల్ తక్కువగా ఉండటంతో, ఇది శస్త్రచికిత్సకు అనుకూల సమయంగా మారింది. గతంలో, 2016లో రోహిత్ తన క్వాడ్రిసెప్స్కు శస్త్రచికిత్స చేయించుకున్నప్పుడు కోలుకోవడానికి మూడు నెలల సమయం పట్టింది. అలాంటి విరామం మళ్లీ లభించకపోవచ్చు అన్న ఆలోచనతోనే ఇన్నాళ్లు రోహిత్ ఈ శస్త్రచికిత్సను వాయిదా వేస్తూ వచ్చాడని తెలిసింది.
రోహిత్ సన్నిహితులు ఒకరు ఈ విషయంలో స్పందిస్తూ, “2027 ప్రపంచకప్లో అత్యుత్తమంగా ఆడాలన్నదే రోహిత్ లక్ష్యం. నాయకత్వ భాద్యతల కారణంగా అతను ఈ నిర్ణయాన్ని ఎప్పటికీ వాయిదా వేస్తున్నాడు. కానీ ఇప్పుడు కోలుకోవడానికి సరైన సమయం దొరికింది” అని తెలిపారు.
ఐపీఎల్ 2025, భారత జట్టుపై ప్రభావం
ప్రస్తుతం ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ 2025లో రోహిత్ శర్మ ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్గా వ్యవహరిస్తున్నాడు. పూర్తి స్థాయిలో ఫీల్డింగ్ చేయకపోవడం అతని హ్యామ్స్ట్రింగ్ గాయమే కారణమని అంటున్నారు. బ్యాటింగ్లో స్థిరతలేమి కూడా ఇదే గాయం ప్రభావంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
2027 ప్రపంచకప్ లక్ష్యం
రోహిత్ శర్మ ముఖ్య లక్ష్యం – భారత్ను 2027 వన్డే ప్రపంచకప్ విజయపథంలో నడిపించడం. ఇందుకోసం శరీరంగా పూర్తిగా ఫిట్గా ఉండటం అత్యవసరం. అభిమానులు, ఈ సర్జరీ తర్వాత రోహిత్ పూర్తి స్థాయిలో కోలుకొని, ప్రపంచకప్ సమయానికి తన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాడని ఆశిస్తున్నారు.
అయితే, ఈ అంశంపై రోహిత్ శర్మ గానీ, బీసీసీఐ గానీ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.