గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కేవలం రూ. 10 వేల అప్పు ఇప్పించలేదన్న కోపంతో, ఓ తాపీ మేస్త్రిని బంధువులే అత్యంత కిరాతకంగా, కన్నతల్లి కళ్లెదుటే కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటన దుగ్గిరాల రజక కాలనీలో తీవ్ర కలకలం రేపింది.
రూ.10 వేల అప్పు.. ఘర్షణకు దారితీసి..
దుగ్గిరాలకు చెందిన వీరబాబు తాపీ మేస్త్రిగా పనిచేస్తూ, తెలిసినవారికి అప్పులు ఇప్పిస్తుంటాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇతని బంధువైన నవీన్ (గుంటూరులో చికెన్ వ్యాపారి) నిన్న ఉదయం వచ్చి, తన వ్యాపారం కోసం రూ. 10,000 అప్పు ఇప్పించాలని అడిగాడు.
అయితే, తన వద్ద లేవని, ఎవరి వద్దా ఇప్పించలేనని వీరబాబు తేల్చి చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో వీరబాబు.. నవీన్ చొక్కా పట్టుకుని, "మరోసారి డబ్బులు అడగవద్దు" అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.
అవమానం.. మద్యం.. హత్యకు ప్లాన్!
చొక్కా పట్టుకున్నాడన్న అవమానంతో నవీన్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. వెంటనే మద్యం సేవించడం మొదలుపెట్టాడు. తన బంధువైన క్రిష్ణకి ఫోన్ చేసి, వీరబాబు చేసిన అవమానం గురించి చెప్పాడు. అనంతరం నవీన్, క్రిష్ణ ఇద్దరూ కలిసి సాయంత్రం వరకు మద్యం సేవించి, వీరబాబుపై పగ పెంచుకున్నారు.
తల్లి కళ్లెదుటే.. ఆర్ఎంపీ క్లినిక్ వద్ద దారుణం
అదే సమయంలో, అనారోగ్యంతో ఉన్న తన తల్లి రమణను వీరబాబు ఆర్ఎంపీ వైద్యశాలకు తీసుకెళ్లాడు. దీన్ని గమనించిన నవీన్, క్రిష్ణ.. నేరుగా క్లినిక్ వద్దకు వచ్చి వీరబాబుతో మళ్లీ గొడవకు దిగారు. కొద్ది సేపటికే, వారు తెచ్చుకున్న కత్తులతో వీరబాబుపై విచక్షణా రహితంగా దాడి చేసి, అక్కడి నుంచి పారిపోయారు.
ఆసుపత్రిలో మృతి.. పోలీసుల దర్యాప్తు
కన్న తల్లి కళ్ల ముందే వీరబాబు రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. స్థానికుల సాయంతో తెనాలి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. వీరబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవలం అప్పు ఇప్పించలేదన్న కారణంతోనే ఈ హత్య జరిగిందా, లేక ఇంకేమైనా పాత కక్షలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
