హాంగ్ కాంగ్ ఇంటర్నేషనల్ సిక్సెస్ 2025 టోర్నమెంట్కు అదిరిపోయే ఆరంభం లభించింది. తొలి రోజే పాకిస్థాన్-కువైట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్, క్రికెట్ అభిమానులకు సిక్సర్ల విందును పంచింది. 36 బంతుల్లో (6 ఓవర్లు) 124 పరుగుల భారీ లక్ష్యాన్ని పాకిస్థాన్ జట్టు చివరి బంతికి ఛేదించి సంచలన విజయాన్ని నమోదు చేసింది.
ఈ అద్భుత ఛేదనలో పాకిస్థాన్ కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది (Abbas Afridi) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
6 ఓవర్లలో 123 పరుగులు.. కువైట్ విధ్వంసం
ముందుగా బ్యాటింగ్ చేసిన కువైట్ జట్టు, నిర్ణీత 6 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి 123 పరుగుల భారీ స్కోరు చేసింది. హాంగ్ కాంగ్ సిక్సెస్ ఫార్మాట్లో ఇది చాలా పెద్ద టార్గెట్. దీంతో పాకిస్థాన్ గెలుపు అసాధ్యమనే అంతా భావించారు.
అబ్బాస్ అఫ్రిది 'సిక్సర్ల' సునామీ
కానీ 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్కు కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది అసాధారణ ఆరంభాన్ని ఇచ్చాడు. కువైట్ బౌలర్లపై మొదటి బంతి నుంచే విరుచుకుపడ్డాడు.
12 బంతుల్లో 55 రన్స్.. ఒకే ఓవర్లో 6 సిక్సర్లు!
అఫ్రిది కేవలం 12 బంతుల్లోనే 55 పరుగులు బాదేశాడు. అతని ఇన్నింగ్స్లో ఏకంగా 8 సిక్సర్లు, ఒక ఫోర్ ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 458గా నమోదైంది. ఈ క్రమంలో ఒక ఓవర్లోని ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదడం హైలైట్గా నిలిచింది.
నిబంధన రూపంలో అడ్డంకి
హాంగ్ కాంగ్ సిక్సెస్ నిబంధనల ప్రకారం, ఏ బ్యాటర్ అయినా 50 పరుగులు పూర్తి చేయగానే రిటైర్డ్ హర్ట్ (నాటౌట్)గా వెనుదిరగాలి. దీంతో 55 పరుగుల వద్ద అఫ్రిది క్రీజు వీడటంతో, పాక్ విజయం మళ్లీ కష్టంగా మారింది.
చివరి ఓవర్ థ్రిల్లర్.. గెలిపించిన షాహిద్
చివరి ఓవర్లో పాకిస్థాన్ విజయానికి 29 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన షాహిద్ అజీజ్ అద్భుతం చేశాడు.
కేవలం 5 బంతుల్లోనే 3 సిక్సర్లు, 1 ఫోర్తో 23 పరుగులు పిండుకున్నాడు. చివరి బంతికి విజయం అందించడంతో పాక్ శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. కువైట్ బౌలర్ యాసిన్ పటేల్ 2 ఓవర్లలో 55 పరుగులు ఇవ్వడం గమనార్హం.
రేపే భారత్-పాకిస్థాన్ మ్యాచ్
ఈ టోర్నమెంట్లో అసలు సిసలు పోరుకు రంగం సిద్ధమైంది. నవంబర్ 7న (రేపు) దాయాదులు భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.
భారత జట్టుకు వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik) కెప్టెన్సీ వహిస్తున్నాడు. జట్టులో రాబిన్ ఉతప్ప, స్టూవర్ట్ బిన్నీ, అభిమన్యు మిథున్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు.
అబ్బాస్ అఫ్రిది విధ్వంసకర ఇన్నింగ్స్, చివరి బంతి వరకు సాగిన ఉత్కంఠ.. ఈ టోర్నీకి గొప్ప ఆరంభాన్ని ఇచ్చాయి. ఇప్పుడు అందరి దృష్టి రేపు జరగబోయే భారత్-పాక్ మ్యాచ్పైనే నిలిచింది.
