"ఈవీఎంలు కాదు.. మోదీ హ్యాక్ చేసింది ప్రజల మనసుల్ని!" అంటూ లోక్సభలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచాయి. ఎన్నికల సంస్కరణల చర్చలో పాల్గొన్న ఆమె.. ప్రతిపక్షాలపై, ముఖ్యంగా గాంధీ కుటుంబంపై నిప్పులు చెరిగారు.
ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో కంగనా రనౌత్ (Kangana Ranaut) తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ ఈవీఎంలను హ్యాక్ చేయడం లేదని, దేశ ప్రజల హృదయాలను హ్యాక్ చేస్తున్నారని ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఓటర్ల జాబితా సవరణ (SIR) దేశ భద్రతకు, మహిళల ఆత్మగౌరవానికి అత్యవసరమని, దీనిని 'ఓట్ల దొంగతనం' అని పిలవడం సరికాదని హితవు పలికారు.
కంగనా క్షమాపణ.. ఎందుకంటే?
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కంగనా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. "రాహుల్ ఏదో పెద్ద సీక్రెట్ చెబుతారనుకుంటే.. మళ్లీ అదే పాత పాట పాడారు. ఓటర్ ఐడీల్లో విదేశీ మహిళ ఫోటోను 22 సార్లు వాడారని ఆరోపించారు. కానీ ఆ మహిళ అసలు భారత్కే రాలేదు. ఆమెకు ఈ సభ తరఫున నేను క్షమాపణ చెబుతున్నా" అని వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు తమను వేధిస్తున్నాయని, కొత్తగా వచ్చిన వారిని నేర్చుకోనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ కాలం నాటి ముచ్చట్లు..
పేపర్ బ్యాలెట్ కావాలంటున్న కాంగ్రెస్కు కంగనా చరిత్రను గుర్తుచేశారు.
రాజ్నారాయణ్ కేసు: ఇందిరా గాంధీ హయాంలో జరిగిన అక్రమాలను గుర్తుచేస్తూ, రాజ్నారాయణ్ కేసు తీర్పుతో ఆమె పదవి ఎలా పోయిందో మరిచిపోవద్దని చురకలంటించారు.
సోనియాపై ఆరోపణ: సోనియా గాంధీకి పౌరసత్వం లేకుండానే 1983 నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారని, ఇది రికార్డుల్లో ఉందని సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ కుటుంబాలకు చట్టాలు చుట్టాలు కాదని స్పష్టం చేశారు.
బీహార్ మోడల్.. వన్ నేషన్ వన్ ఎలక్షన్!
ఓటర్ల జాబితా సవరణను ఒక 'శుద్ధీకరణ'గా ఆమె అభివర్ణించారు. బీహార్లో 60 లక్షల దొంగ ఓట్లను తొలగించిన తర్వాతే అక్కడ 67 శాతం పోలింగ్ నమోదైందని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఈ ప్రక్షాళన జరగాలని, 'ఒకే దేశం - ఒకే ఎన్నిక' విధానం తక్షణం అమల్లోకి రావాలని కంగనా డిమాండ్ చేశారు.

