నేపాల్ వెళ్లే భారత పర్యాటకులకు, యాత్రికులకు అదిరిపోయే శుభవార్త! ఇకపై అక్కడికి వెళ్ళేటప్పుడు చిల్లర కోసం, రూ. 100 నోట్ల కట్టల కోసం వెతుక్కోవాల్సిన పనిలేదు. భారత కరెన్సీకి చెందిన పెద్ద నోట్లపై నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్-నేపాల్ మధ్య ప్రయాణించే వారికి ఊరటనిస్తూ.. భారత కరెన్సీ రూ. 200, రూ. 500 నోట్లను తమ దేశంలోకి తీసుకురావడానికి, వినియోగించడానికి నేపాల్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అక్కడి క్యాబినెట్ అధికారిక నిర్ణయం తీసుకున్నట్లు సమాచార శాఖ మంత్రి జగదీశ్ ఖరేల్ వెల్లడించారు.
రూ. 25 వేల వరకు లిమిట్..
ఆర్బీఐ (RBI) ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్కు అనుగుణంగా నేపాల్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి ఒక షరతు ఉంది.
పరిమితి: ఇక్కడి నుంచి వెళ్లేవారు తమ వెంట గరిష్ఠంగా రూ. 25,000 వరకు మాత్రమే ఈ పెద్ద నోట్లను (రూ. 200, రూ. 500) తీసుకెళ్లగలరు.
వర్తింపు: ఈ నిబంధన భారత పర్యాటకులకే కాకుండా, నేపాల్ పౌరులకు కూడా వర్తిస్తుంది.
పర్యాటకులకు పెద్ద రిలీఫ్!
2016లో భారత్లో నోట్ల రద్దు (Demonetization) జరిగిన తర్వాత, రూ. 100 కంటే ఎక్కువ విలువైన భారత నోట్లను నేపాల్ నిషేధించింది. దీంతో ఇన్నాళ్లు నేపాల్ వెళ్లే పర్యాటకులు, వైద్యం కోసం భారత్ వచ్చే నేపాల్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెద్ద నోట్లు దొరికితే చట్టవిరుద్ధంగా పరిగణించేవారు. తాజా నిర్ణయంతో ఆ కష్టాలన్నీ తీరిపోయాయి. సరిహద్దుల్లోని ప్రజలకు, యాత్రికులకు ఇది ఎంతో మేలు చేకూర్చనుంది.

