డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు.. కానీ మనుషులు, వారి మేధస్సు పోతే? దాయాది దేశం పాకిస్థాన్ ఇప్పుడు సరిగ్గా ఇదే సంక్షోభంలో కూరుకుపోయింది. అక్కడ డాక్టర్లు లేరు, ఇంజినీర్లు దొరకడం లేదు. దేశం ఖాళీ అవుతోంది. ఇది కేవలం వలస కాదు.. ఒక దేశ భవిష్యత్తు ఆవిరైపోతున్న దయనీయ దృశ్యం. పాకిస్థాన్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద 'మేధో వలస' (Brain Drain) సాగుతోంది. రాజకీయ అస్థిరత, ఆర్థిక మాంద్యం దెబ్బకు చదువుకున్న యువత దేశం విడిచి పారిపోతున్నారు.
ప్రభుత్వ నివేదిక చూస్తే గుండె గుభేల్ మంటుంది. గత రెండేళ్లలో ఏకంగా 5 వేల మంది డాక్టర్లు, 11 వేల మంది ఇంజినీర్లు, 13 వేల మంది అకౌంటెంట్లు పాకిస్థాన్కు గుడ్ బై చెప్పేసి విదేశాలకు వెళ్లిపోయారు. వీరంతా సామాన్యులు కాదు, దేశ ఆర్థిక, ఆరోగ్య వ్యవస్థను నడిపించాల్సిన ఇంజిన్లు. వీరు వెళ్లిపోవడంతో ఆయా రంగాలు కుప్పకూలే ప్రమాదంలో పడ్డాయి.
ఒకప్పుడు గల్ఫ్ దేశాలకు కేవలం కూలీలు మాత్రమే వెళ్లేవారు. ఇప్పుడు సూటు బూటు వేసుకున్న వైట్ కాలర్ ఉద్యోగులు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఆసుపత్రుల పరిస్థితి మరీ ఘోరం. 2011 నుంచి చూస్తే నర్సుల వలస ఏకంగా 2,144 శాతం పెరిగింది. డాక్టర్లు, నర్సులు లేని ఆసుపత్రుల్లో రోగుల పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే భయమేస్తుంది.
దేశం పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు మంటల్లో ఆజ్యం పోశాయి. ఇది "బ్రెయిన్ డ్రెయిన్ (నష్టం) కాదు.. బ్రెయిన్ గైన్ (లాభం)" అంటూ ఆయన సెలవిచ్చారు. విదేశాలకు వెళ్తే వాళ్ళు డబ్బు పంపిస్తారు కదా అన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. కానీ సొంత దేశంలో అవకాశాలు లేక, బతకలేక పారిపోతుంటే దాన్ని 'లాభం' అని ఎలా అంటారని ప్రజలు, విపక్షాలు మండిపడుతున్నాయి.
మరోవైపు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఫ్రీలాన్సింగ్ హబ్గా ఉన్న పాకిస్థాన్లో.. తరచూ ఇంటర్నెట్ షట్డౌన్ల వల్ల ఏకంగా 1.62 బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. దీంతో 23 లక్షల మంది ఫ్రీలాన్సర్ల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. జనం వెళ్లిపోతుంటే ఆపలేక, ప్రభుత్వం విమానాశ్రయాల్లో ఆంక్షలు పెడుతోంది. 2025లో ఇప్పటివరకు వేల మందిని ఎయిర్పోర్టుల్లోనే నిలిపివేశారు. దీన్నిబట్టి అక్కడి యువతలో దేశం పట్ల ఎంత నిరాశ ఉందో అర్థం చేసుకోవచ్చు.
బాటమ్ లైన్..
ఒక దేశం ఆస్తులు కోల్పోయినా కోలుకుంటుంది కానీ, మేధస్సును కోల్పోతే కోలుకోలేదు. పాకిస్థాన్ ఇప్పుడు ఐసీయూలో ఉంది. అక్కడి పాలకులు సమస్య మూలాలను వదిలేసి, వెళ్లేవారిని ఎయిర్పోర్టుల్లో ఆపాలని చూడటం అవివేకం. "బ్రెయిన్ గైన్" అని కవరింగ్ ఇచ్చుకోవడం వాస్తవాల నుంచి పారిపోవడమే. కడుపు నిండే మార్గం, భవిష్యత్తుపై భరోసా ఉంటే సొంత ఇల్లు వదిలి ఎవరూ వెళ్లరు. ఈ వలసలు ఆగకపోతే.. పాకిస్థాన్ రేపటి రోజున యువత లేని, కేవలం వృద్ధులు మిగిలిన ఒక అనాథాశ్రమంలా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

