Kabul Hospital Attack: కాబూల్ ఆస్పత్రిపై పాక్ పైశాచిక దాడి.. 408 మంది మృతి, తీవ్రంగా ఖండించిన భారత్!
పవిత్ర రంజాన్ మాసంలో పాకిస్థాన్ అత్యంత అమానుషమైన, పైశాచిక చర్యకు పాల్పడింది. ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లోని ఓ ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడికి తెగబడటం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దారుణ ఘటనలో రోగులతో సహా ఏకంగా 408 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం, వందలాది మంది తీవ్రంగా గాయపడటం ఒక పెను విషాదం. ఈ ఉదంతం మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోగా, పాకిస్థాన్ చేసిన ఈ పిరికిపంద చర్యను భారతదేశం తీవ్ర స్థాయిలో ఖండించింది.
కాబూల్ ఆసుపత్రిపై దారుణ మారణహోమం
స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో కాబూల్లోని 2,000 పడకల సామర్థ్యం ఉన్న డ్రగ్ రిహాబిలిటేషన్ ఆస్పత్రి (ఒమిద్ ఆస్పత్రి)పై పాకిస్థాన్ దళాలు వైమానిక దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో ఆసుపత్రిలోని చాలా భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వ ఉప అధికార ప్రతినిధి హమ్దుల్లా ఫిట్రాత్ అధికారికంగా వెల్లడించారు.
ఈ ఘోర దాడిలో ఇప్పటివరకు 408 మందికి పైగా చనిపోయారని, మరో 250 మందికి పైగా గాయపడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చికిత్స పొందుతున్న అమాయక రోగులను సైతం లక్ష్యంగా చేసుకోవడం పాక్ క్రూరత్వానికి నిదర్శనంగా మారింది.
పిరికిపంద చర్య.. తీవ్రంగా ఖండించిన భారత్
పాకిస్థాన్ దురాగతాన్ని భారతదేశం అత్యంత తీవ్రంగా ఖండించింది. ఇదొక పిరికిపంద, అమానుష చర్యగా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు శాంతి, కరుణతో గడిపే పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి హేయమైన దాడికి పాల్పడటం పాకిస్థాన్ దిగజారుడుతనానికి అద్దం పడుతోందని మండిపడింది.
ఆస్పత్రిని, రోగులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఏ మతమూ, ఏ చట్టమూ, ఏ నైతికతా సమర్థించదని భారత్ తేల్చి చెప్పింది. ఇది కచ్చితంగా ఆప్ఘనిస్థాన్ సార్వభౌమాధికారంపై జరిగిన దారుణమైన దాడి అని, దీనివల్ల ప్రాంతీయ శాంతి, భద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోందని భారత్ ధ్వజమెత్తింది.
అంతర్జాతీయ సమాజం స్పందించాలి
మిలిటరీ ఆపరేషన్ ముసుగులో పాకిస్థాన్ ఒక మారణహోమాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని భారతదేశం ఆరోపించింది. పాకిస్థాన్ చేస్తున్న ఈ నేరపూరిత ఘాతుకాలను అంతర్జాతీయ సమాజం తక్షణమే ఖండించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా ఒత్తిడి తేవాలని భారత్ డిమాండ్ చేసింది.
ఈ విపత్కర, విషాద సమయంలో ఆప్ఘనిస్థాన్ ప్రజలకు అండగా నిలుస్తామని భారత్ భరోసా ఇచ్చింది. దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించడంతో పాటు, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

