అగ్రరాజ్యం అమెరికా, పశ్చిమాసియా సింహం ఇరాన్ మధ్య మాటల యుద్ధం అణుబాంబును మించి పేలుతోంది! ఇరాన్ను సర్వనాశనం చేస్తామని, ఆ దేశాన్ని మళ్లీ ‘రాతి యుగం’లోకి (Stone Age) నెట్టేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన భయంకరమైన హెచ్చరికలపై టెహ్రాన్ అగ్గిమీద గుగ్గిలమైంది. అమెరికా తమను రాతియుగంలోకి కాదు.. తమ సొంత సైనికులనే సమాధుల్లోకి పంపుకుంటోందంటూ ఇరాన్ ఘాటుగా హెచ్చరించింది.
250 ఏళ్ల దేశం.. 6 వేల ఏళ్ల నాగరికత!
కేవలం 250 ఏళ్ల చరిత్ర ఉన్న అమెరికా.. ఏకంగా 6 వేల సంవత్సరాల సుదీర్ఘ, అద్భుతమైన నాగరికత కలిగిన ఇరాన్ను బెదిరించడం కేవలం వారి భ్రమ మాత్రమేనని ఇరాన్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ మేరకు ఇరాన్ ఎలైట్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఏరోస్పేస్ ఫోర్స్ కమాండోస్ బ్రిగేడియర్ జనరల్ సయ్యద్ మాజిద్ మొసావి రంగంలోకి దిగారు. అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ 'ఎక్స్' (ట్విట్టర్) లో చేసిన ఓ రెచ్చగొట్టే పోస్ట్కు ఆయన పవర్ఫుల్ కౌంటర్ ఇచ్చారు.
హెగ్సెత్ పోస్ట్.. మొసావి ఫైర్!
అసలు అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్ ఏమన్నారంటే.. "గత అధ్యక్షుల కంటే తక్కువ తీవ్రవాద భావాలు కలిగిన, అత్యంత తెలివైన ఇరాన్ కొత్త అధ్యక్షుడు ఇప్పుడే మాతో కాల్పుల విరమణ కోరారు. హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచి, నౌకల స్వేచ్ఛా రాకపోకలకు అనుమతిస్తేనే దానిపై మేం ఆలోచిస్తాం. అప్పటి వరకు మా అధ్యక్షుడు చెప్పినట్లు ఇరాన్ను దాడులతో రాతియుగానికి నెట్టేస్తాం" అని పోస్ట్ చేశారు.
దీనిపై బ్రిగేడియర్ జనరల్ మొసావి ఏకిపారేశారు. "మమ్మల్ని కాదు.. మీరే మీ సైనికులను నేరుగా సమాధుల వైపు నడిపిస్తున్నారు. హాలీవుడ్ సినిమాల భ్రమల్లో బతుకుతున్న మీ మనసులు ఎంతగా విషపూరితమయ్యాయంటే.. 250 ఏళ్ల అమెరికా, 6 వేల ఏళ్ల ఇరాన్ నాగరికతను బెదిరిస్తోంది" అంటూ ఉతికి ఆరేశారు.
ఐదో వారం నెత్తుటి యుద్ధం..
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య రగులుకున్న ఈ మహా సంగ్రామం ఇప్పుడు ఐదో వారంలోకి అడుగుపెట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన భీకర వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ దారుణంగా హత్యకు గురైన సంగతి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
దీనికి ప్రతీకారంగా రగిలిపోయిన ఇరాన్.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలతో పాటు, వారి మిత్రదేశాల ఇంధన మౌలిక సదుపాయాలపై భీకర దాడులకు దిగింది. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి హార్మూజ్ జలసంధిని పూర్తిగా తన ఉక్కుపిడికిలిలో బంధించి అమెరికాకు ఊపిరి ఆడకుండా చేస్తోంది.
ట్రంప్ అయోమయ ప్రకటనలు!
ఇంత జరుగుతున్నా.. ఈ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న గజిబిజి ప్రకటనలు పరిస్థితిని మరింత అయోమయంలోకి నెడుతున్నాయి. ఒకసారి తెరవెనుక శాంతి చర్చలు జరుగుతున్నాయని, యుద్ధం ముగుస్తుందని ఆయన చెబుతున్నారు.
మరోసారి మాత్రం ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే వరకు మా క్షిపణుల దాడులు ఆగవంటూ పూటకో మాట మాట్లాడుతున్నారు. అగ్రరాజ్యాధినేత చేస్తున్న ఈ గందరగోళ ప్రకటనలతో పశ్చిమాసియాలో పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా మారుతోంది.
అటు రాతియుగం హెచ్చరికలు.. ఇటు సమాధుల వార్నింగ్ల మధ్య.. పశ్చిమాసియా ఎడారి ఇసుకలో ఎవరి సామ్రాజ్యం కూలిపోనుందో అని యావత్ ప్రపంచం బిక్కుబిక్కుమంటోంది!
Also Read:
టెన్షన్ వద్దు మీరు సేఫ్.. ట్విట్టర్లో ఇరాన్ సెన్సేషనల్ ట్వీట్అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ సక్సెస్: ట్రంప్ సంచలన ప్రసంగం!
హార్మూజ్ జలసంధికి లింక్: ట్రంప్ vs ఇరాన్ వార్!
ఇరాన్ పాలకులపై సైన్యం తిరుగుబాటు.. గుప్పిట్లో అధ్యక్షుడు!
ఇరాన్ యుద్ధం మాకొద్దు: డొనాల్డ్ ట్రంప్కు బ్రిటన్ ప్రధాని షాక్!

.webp)