ఉదయం లేచి పాల ప్యాకెట్ కొందామంటే రెండు రూపాయలు పెరిగింది. ఆఫీస్కు వెళ్దామని ఆటో ఎక్కితే ఛార్జీలు పెంచేశారు. వీకెండ్లో జొమాటోలో బిర్యానీ ఆర్డర్ చేద్దామంటే డెలివరీ ఫీజుల బాదుడు తప్పట్లేదు. ఇదంతా ఎందుకు జరుగుతోందో తెలుసా? నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దేశంలో మళ్లీ చమురు మంటలు రగులుకుంటున్నాయి. ఇది కేవలం మీ బైక్లో పోసే పెట్రోల్ ధరల పెంపు మాత్రమే కాదు, ప్రతి సామాన్యుడి వంటగది బడ్జెట్ను కుదిపేయబోతున్న ఆర్థిక సునామీ. ఎందుకు ఒక సామాన్యుడు దీని గురించి భయపడాలో ఇక్కడ తెలుసుకోండి.
నాలుగేళ్ల నిశ్శబ్దం బద్దలు.. లీటరుకు రూ. 3.39 వాత
పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు మన దేశాన్ని నేరుగా తాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు శుక్రవారం ధరల బాంబు పేల్చాయి.
పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు సుమారు రూ. 3.39 చొప్పున పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత జరిగిన ఈ పెంపు సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
ఇదే ఆఖరు అనుకుంటే పొరపాటే! ముడిచమురు సంక్షోభం ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో ఈ ధరల మంట మరింత భయంకరంగా ఉండబోతోందని ఆర్థిక నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
కూరగాయల నుంచి పాలు దాకా.. రవాణా భారం
ఇంధన ధరల పెంపు అంటే కేవలం సొంత వాహనాలు వాడేవారికి మాత్రమే నష్టం కాదు. డీజిల్ ధరలు పెరిగితే దేశంలో రవాణా వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తం అవుతుంది.
మనం తినే కూరగాయలు, పండ్లు, బియ్యం.. ప్రతి ఒక్క నిత్యావసర వస్తువూ లారీలు, వ్యాన్ల ద్వారానే మన ఇళ్లకు చేరుతుంది. రవాణా ఖర్చులు పెరిగితే ఆ భారం మొత్తం నేరుగా వస్తువుల ధరల పైనే పడుతుంది.
దీనికి ప్రత్యక్ష ఉదాహరణే పాల ధరల పెంపు. పెరిగిన రవాణా ఖర్చులను సాకుగా చూపుతూ అమూల్, మదర్ డెయిరీ సంస్థలు అప్పుడే పాల ధరలను లీటరుకు రూ. 2 చొప్పున పెంచేసి సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టాయి.
జొమాటో, అమెజాన్.. ఆన్లైన్ ప్రియులకూ సెగ
ఈ పెంపు దెబ్బకు బస్సు ఛార్జీలు, క్యాబ్, ఆటోల రేట్లు అమాంతం పెరగడం ఖాయం. కానీ ప్రభావం అంతటితో ఆగిపోదు.
మనకు రోజూ అలవాటైన స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్, అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థల డెలివరీ చార్జీలు కూడా భారీగా పెరగబోతున్నాయి.
కంపెనీలు తమపై పడే ఈ డీజిల్ భారాన్ని తగ్గించుకోవడానికి.. కస్టమర్లకు ఇచ్చే డిస్కౌంట్లలో కోత విధించడం లేదా డెలివరీ ఫీజులను పెంచడం తథ్యంగా కనిపిస్తోంది.
గ్రామాలపై తీవ్ర ప్రభావం.. రైతన్నకు కష్టకాలం
నగరాల కంటే ఈ ఇంధన ధరల సెగ పల్లెటూళ్లకు మరింత ఘోరంగా తగలనుంది. అన్నదాతలు తమ వ్యవసాయం కోసం వాడే ట్రాక్టర్లు, కరెంటు లేనప్పుడు వాడే నీటి పంపులు అన్నీ పూర్తిగా డీజిల్పైనే ఆధారపడి ఉంటాయి.
డీజిల్ ధరలు ఇలా భగ్గుమంటే వ్యవసాయ పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయి రైతులకు లాభాలు గాల్లో కలిసిపోతాయి. ఇది అంతిమంగా దేశంలో తీవ్రమైన ఆహార ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని మార్కెట్ వర్గాలు భయపడుతున్నాయి.
పరిస్థితి తీవ్రతను గమనించిన ప్రధాని నరేంద్ర మోడీ.. పెరుగుతున్న ముడిచమురు ధరల దృష్ట్యా ప్రజలు ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని ఇప్పటికే బహిరంగంగా పిలుపునిచ్చారు.
చమురు సరఫరా అత్యంత ఖరీదైనదిగా మారిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో.. ధరల పెరుగుదల అనివార్యమని ఎకనామిస్టులు చెబుతున్నారు. ఈ పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు అనేది నిత్యావసరాల నుంచి విలాసాల వరకు ప్రతి అంశంపైనా పడే ఒక 'సెలైంట్ ట్యాక్స్' (నిశ్శబ్ద పన్ను). ఈ పెను భారాన్ని తట్టుకోవాలంటే.. వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించి కార్ పూలింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు మళ్లడం అత్యవసరం. అలాగే ఆన్లైన్ ఆర్డర్ల మోజు తగ్గించుకుని, ఖర్చులను కట్టడి చేసుకుంటేనే ఈ ఆర్థిక మాంద్యం లాంటి పరిస్థితుల నుంచి మన జేబును మనం కాపాడుకోగలం!

