టిబెటన్ బౌద్ధ గురువు దలైలామా తన వారసుడిని ఎంపిక చేసేందుకు హక్కు లేదని చైనా మరోసారి స్పష్టం చేసింది. టిబెట్కు చెందిన ‘లివింగ్ బుద్ధాల’ పునర్జన్మ సంప్రదాయం 700 సంవత్సరాల నాటిది అని చెబుతూ, ఈ ప్రక్రియపై నిర్ణయం తీసుకునే అధికారం ఆయనకు లేదని బీజింగ్ అభిప్రాయపడింది.
చైనా రాయబారి వ్యాఖ్యలు
భారతదేశంలో చైనా రాయబారి షూ ఫెయిహాంగ్, తన ఎక్స్ (Twitter) ఖాతాలో పోస్ట్ చేస్తూ, దలైలామా పునర్జన్మ ప్రక్రియకు సంబంధించి చైనా చట్టాలు, మతపరమైన ఆచారాల మేరకే నిర్ణయాలు ఉండాలని స్పష్టం చేశారు. పునర్జన్మ వ్యవస్థ దలైలామాతో ప్రారంభం కాలేదని, ఆయనతోనే ముగియనూ కాదన్నారు. దలైలామా కేవలం ఆ సంప్రదాయంలో భాగమే అని అన్నారు.
లివింగ్ బుద్ధ సంప్రదాయం గురించి
చైనాలో ప్రస్తుతం టిబెట్తో పాటు జిజాంగ్, సిచువాన్, యునాన్, గన్సు, క్వింగ్హాయ్ ప్రాంతాల్లో పునర్జన్మ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో దాదాపు 1000 పునర్జన్మ విధానాలు అమల్లో ఉన్నాయని చైనా పేర్కొంది. టిబెటన్ బౌద్ధంలో ఇది ఒక ప్రత్యేక పద్ధతి అని చెబుతోంది.
భారత్ స్పందనపై చైనా కౌంటర్
ఈ నెల 2న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, దలైలామా పునర్జన్మ పూర్తిగా మతపరమైన అంశమని, అందులో నిర్ణయం తీసుకునే హక్కు బౌద్ధ సంప్రదాయాలకు మాత్రమే ఉందని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు స్పందనగా చైనా రాయబారి ఈ వివాదాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో జూలై 6న దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన రావడం చర్చనీయాంశమైంది.

