భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపిస్తున్న ప్రతాపం ఇప్పుడు ఆయనకే రివర్స్ కొడుతోంది. భారత్ నుంచి వచ్చే వస్తువులపై భారీగా పన్నులు (Tariffs) విధించాలన్న నిర్ణయంపై సొంత దేశంలోనే తిరుగుబాటు మొదలైంది.
ట్రంప్ విధించిన కఠిన సుంకాల విధానాన్ని సవాలు చేస్తూ ముగ్గురు ప్రతినిధుల సభ సభ్యులు నిన్న ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 'జాతీయ అత్యవసర పరిస్థితి'ని అడ్డం పెట్టుకుని భారత్పై ఏకంగా 50 శాతం వరకు సుంకాలు విధించడం సరికాదని, వెంటనే ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. డెమొక్రాటిక్ పార్టీకి చెందిన డెబోరా రాస్, మార్క్ వీసే, భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి ఈ తీర్మానాన్ని సభ ముందుంచారు.
అమెరికన్లకే ఎసరు.. ఈ పన్నులు వద్దు!
ఆగస్టు 27, 2025న విధించిన అదనపు 25 శాతం సెకండరీ టారిఫ్లను ఈ తీర్మానం ప్రధానంగా వ్యతిరేకిస్తోంది. సభ్యులు లేవనెత్తిన కీలక అంశాలు ఇవే:
- ఆర్థిక వ్యవస్థపై దెబ్బ: ఈ పన్నుల వల్ల అమెరికాలోని నార్త్ కరోలినా వంటి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోందని డెబోరా రాస్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్తో ఉన్న వాణిజ్య బంధం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.
- సామాన్యులపై భారం: ఇది పరోక్షంగా అమెరికన్ వినియోగదారులపై వేస్తున్న పన్నేనని, ఇప్పటికే ధరలతో ఇబ్బంది పడుతున్న జనం మరింత చితికిపోతారని మార్క్ వీసే విమర్శించారు.
- సప్లయ్ చైన్: ఈ చర్యలు సరఫరా గొలుసును (Supply Chain) దెబ్బతీసి, కార్మికులకు నష్టం చేస్తున్నాయని రాజా కృష్ణమూర్తి మండిపడ్డారు.
రష్యా ఆయిల్ ఎఫెక్ట్..
భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని, తద్వారా పరోక్షంగా రష్యా యుద్ధానికి నిధులు ఇస్తోందని ఆరోపిస్తూ ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 1న మొదట 25 శాతం, ఆ తర్వాత కొద్ది రోజులకే మరో 25 శాతం సుంకాలు వేశారు. అయితే, ట్రంప్ తన అత్యవసర అధికారాలను ఉపయోగించి ఇలా వాణిజ్య యుద్ధానికి తెరలేపడాన్ని సొంత నేతలే అడ్డుకుంటుండటం గమనార్హం.

