Putta Mahesh Yadav: ఏలూరు ఎంపీపై సీఎం చంద్రబాబు ఫైర్

naveen
By -

ఏలూరు ఎంపీపై సీఎం చంద్రబాబు ఫైర్

Putta Mahesh Yadav: ఆ పార్టీలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏలూరు ఎంపీపై సీఎం చంద్రబాబు సీరియస్!


తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, ఇంచార్జి మంత్రితో మంగళవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రాజకీయ పరిస్థితులతో పాటు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఫామ్‌హౌస్ వ్యవహారంపై సీఎం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించేది లేదని ఆయన నాయకులకు స్పష్టం చేశారు.


ఎంపీ ప్రవర్తనపై అధినేత అసంతృప్తి


యువకుడని, పైగా మంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడని ఎంతో నమ్మకంతో పుట్టా మహేష్‌కు ఏలూరు ఎంపీగా అవకాశమిచ్చామని, కానీ ఆయన ప్రవర్తన ఏమాత్రం ఆశించిన విధంగా లేదని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మహేష్ చేసిన తప్పునకు ఇప్పుడు పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి రావడం చాలా దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు అలాంటి పార్టీలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించిన సీఎం.. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే ఇలాంటి వాళ్లను మోయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. 


గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు ఎంతటి పెద్ద నాయకులైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకున్నానని గుర్తు చేశారు. క్రమశిక్షణ, విలువలు లేకుండా రాజకీయం చేయాలనుకోవడం కరెక్ట్ కాదని గట్టి వార్నింగ్ ఇచ్చారు. పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు.


డ్రగ్స్ టెస్టులో పాజిటివ్.. ఎంపీ వివరణ ఇదీ


ఇటీవల మొయినాబాద్‌లోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌తో పాటు మరికొందరు పట్టుబడిన విషయం విదితమే. ఆ పార్టీలో తాము ఎలాంటి డ్రగ్స్ వాడలేదని నిందితులు బుకాయించినప్పటికీ, పోలీసులు నిర్వహించిన వైద్య పరీక్షల్లో మొత్తం 11 మందిలో ఆరుగురికి పాజిటివ్ అని తేలింది. డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన ఆ ఆరుగురిలో ఎంపీ పుట్టా మహేష్ కూడా ఉండటం రాజకీయంగా సంచలనంగా మారింది. 


ఈ ఫామ్‌హౌస్ ఘటనపై ఎంపీ పుట్టా స్పందిస్తూ.. తాను కేవలం డిన్నర్ కోసమే అక్కడికి వెళ్లానని, ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చుకున్నారు. పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని, పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని ఆయన వెల్లడించారు.