Dubai Economic Crisis: పేకమేడలా కూలుతున్న దుబాయ్ రియల్ ఎస్టేట్.. తీవ్ర సంక్షోభంలో పర్యాటక స్వర్గధామం!
ప్రపంచ కుబేరులకు అడ్డాగా, లగ్జరీ లైఫ్స్టైల్కు కేరాఫ్ అడ్రస్గా గుర్తింపు పొందిన దుబాయ్ ఇప్పుడు కనీవినీ ఎరుగని ఆర్థిక గండంలో చిక్కుకుంది. ఒకప్పుడు వెలుగుజిలుగులతో కళకళలాడిన ఈ నగరం.. తాజా పరిణామాలతో కళావిహీనంగా మారుతోంది. రియల్ ఎస్టేట్ పతనం నుంచి పర్యాటక రంగం కుదేలు కావడం వరకు.. ఎమిరేట్స్ ఆర్థిక పునాదులు భారీగా కదులుతున్నాయి. ఈ పరిస్థితి కేవలం దుబాయ్కే పరిమితం కాకుండా, అక్కడ పెట్టుబడులు పెట్టిన ప్రపంచవ్యాప్త ఇన్వెస్టర్ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
పేకమేడలా రాలుతున్న రియల్ ఎస్టేట్
దుబాయ్ అనగానే ఆకాశాన్ని తాకే భవనాలు గుర్తుకొస్తాయి. ఆ నగరానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఆ ప్రాపర్టీ మార్కెట్ ఇప్పుడు పేకమేడలా కుప్పకూలుతోంది. గడిచిన పదిహేను రోజుల్లోనే ప్రాపర్టీ ఇండెక్స్ ఏకంగా 35 శాతం మేర పడిపోవడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. బుర్జ్ ఖలీఫా లాంటి అద్భుత కట్టడాలను నిర్మించిన ఎమార్, అలాగే మరో దిగ్గజ సంస్థ ఆల్దర్ షేర్లు ఏకంగా 40 శాతం పతనమయ్యాయి. కొత్త ప్రాజెక్టులు లేక, కొనుగోలుదారులు రాక భవన నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైంది. దీనిపై ఆధారపడి బతుకుతున్న లక్షలాది మంది వలస కార్మికుల ఉపాధి ఇప్పుడు గాలిలో దీపంలా మారింది.
వెనక్కి మళ్లుతున్న పెట్టుబడులు
ఆర్థిక మార్కెట్లలో సైతం దుబాయ్ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. అంతర్జాతీయ ఎమర్జింగ్ మార్కెట్లలో యూఏఈ కార్పొరేట్ బాండ్ల విలువ దారుణంగా పడిపోయింది. పరిస్థితి తీవ్రతను గమనించిన గ్లోబల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుని, సురక్షిత ప్రాంతాలకు మళ్లిస్తున్నారు. దీనికి తోడు గ్లోబల్ రేటింగ్ సంస్థలు సైతం దుబాయ్ ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రతికూల నివేదికలు ఇస్తుండటంతో.. నగరంలోకి కొత్త పెట్టుబడులు రావడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.
బోసిపోతున్న విలాసవంతమైన హోటళ్లు
దుబాయ్ ఆర్థిక వ్యవస్థను నడిపించే మరో ప్రధాన ఇంజిన్ పర్యాటక రంగం. కానీ ఇప్పుడు అక్కడి స్టార్ హోటళ్లన్నీ టూరిస్టులు లేక బోసిపోతున్నాయి. లగ్జరీ హోటళ్లలో ఆక్యుపెన్సీ రేటు అనూహ్యంగా 20 శాతానికి పడిపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. పర్యాటక సీజన్ ముగుస్తున్న సమయంలో ఎన్నో టూర్ ప్యాకేజీలు రద్దయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణాలపై నెలకొన్న ఆంక్షలు, అనిశ్చితి కారణంగా వేలాది విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్లైన్స్లో ఒకటైన ఎమిరేట్స్ సైతం భారీ నష్టాలను చవిచూస్తోంది.
పెరిగిన చమురు మంట.. ఉద్దీపనలు ఇస్తేనే!
అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు 100 డాలర్లు దాటడం దుబాయ్ పాలిట మరో శాపంగా మారింది. చమురు ఉత్పత్తి దేశమే అయినప్పటికీ.. పెరిగిన ఇంధన ధరల వల్ల రవాణా, నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. దీంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి, సామాన్యుల కొనుగోలు శక్తి పడిపోయింది. నష్టాలను భరించలేక పలు వ్యాపార సంస్థలు శాశ్వతంగా మూతపడుతున్నాయి. ఇలా అన్ని రంగాలు ఒకేసారి దెబ్బతినడంతో దుబాయ్ ఊపిరి తీసుకోలేని స్థితికి చేరుకుంది. అక్కడి ప్రభుత్వం తక్షణమే స్పందించి భారీ ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తే తప్ప.. ఈ నగరం మళ్లీ గాడిన పడే అవకాశం లేదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Also Read:
India Condemns Pakistan: పవిత్ర రంజాన్ మాసంలో ఈ పైశాచికం ఏంటి? పాక్ వైమానిక దాడిపై భారత్ ఫైర్US Iran War Updates: నాటో దేశాలపై డొనాల్డ్ ట్రంప్ ఫైర్.. ప్రపంచంలోనే పవర్ ఫుల్ సైన్యం మాదే అంటూ కామెంట్స్
Kabul Airstrikes: పాక్ దాడిపై రషీద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం
Mojtaba Khamenei: తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న మొజ్తబా

