తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘రైతు భరోసా’ (Rythu Bharosa) పథకానికి సంబంధించి నూతన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. సాగు పెట్టుబడి కోసం ఇబ్బంది పడుతున్న రైతులకు అండగా నిలవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే కొత్త రైతులు వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఎకరాకు రైతుల బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి రూ.12 వేలు జమ చేస్తున్న విషయం తెలిసిందే.
అర్హతలు, నిబంధనలు ఇవే..
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా నిబంధనల ప్రకారం.. 2026 ఫిబ్రవరి 28 నాటికి తమ పేరు మీద భూమి పట్టా పాస్ బుక్ పొందిన వారు ఈ పథకానికి అర్హులు. అలాగే, రెవెన్యూ రికార్డులలో (ధరణి లేదా ఇతర సంబంధిత పోర్టల్) భూమి వివరాలు నమోదై, డిజిటల్ సంతకం (Digital Signature) ప్రక్రియ పూర్తయిన రైతులు మాత్రమే అర్హులుగా పరిగణించబడతారు. ఇప్పటివరకు రైతు భరోసా పొందని వారు లేదా ఫిబ్రవరి 28 తర్వాత కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.
ఏయే పత్రాలు కావాలంటే?
కొత్తగా అర్హత సాధించిన రైతులు పలు ముఖ్యమైన పత్రాల జిరాక్స్ కాపీలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి (AEO) సమర్పించాల్సి ఉంటుంది. అందులో నూతన పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ తప్పనిసరిగా ఉండాలి.
పాత లబ్ధిదారులకు మళ్లీ అవసరం లేదు
గతంలోనే రైతు భరోసా పొందుతున్న పాత రైతులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. వారి వివరాలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద భద్రంగా ఉండటంతో.. నిధులు నేరుగా వారి ఖాతాల్లోనే జమ అవుతాయి. కొత్తగా పాస్ బుక్ పొందిన వారు మాత్రం సాగు కాలం ప్రారంభానికి ముందే ఏఈవోలను సంప్రదించి తమ వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి. అర్హులైన ప్రతి రైతుకూ న్యాయం జరిగేలా కేవలం డిజిటల్ రికార్డుల ఆధారంగానే లబ్ధిదారులను పక్కాగా ఎంపిక చేస్తున్నారు.
రైతు భరోసా పథకం ద్వారా అందుతున్న ఈ పెట్టుబడి సాయం.. రైతులు విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు ఖర్చుల కోసం ఇతరులపై ఆధారపడకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. కాబట్టి, అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, సకాలంలో తమ దరఖాస్తులు సమర్పించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read:
AP TS Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలుTelangana Politics Latest News: శ్రీరామనవమి తర్వాత కొత్త పార్టీ ప్రకటించనున్న ఎమ్మెల్సీ కవిత
Moinabad Farmhouse Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసు వేళ నటి హేమ సంచలన వ్యాఖ్యలు
TGSRTC Updates: ఆర్టీసీ ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్ రద్దు
Jeevan Reddy: ఎమ్మెల్యే సంజయ్పై జీవన్ రెడ్డి ఫైర్
KTR Assembly Speech: కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్

