Tamil Nadu Elections: అమిత్ షాతో త్రిష చర్చలు? పొత్తుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన విజయ్

naveen
By -

Tamil Nadu Elections

Tamil Nadu Elections: పొత్తులపై పుకార్లకు చెక్ పెట్టిన విజయ్.. ఎన్డీఏతో వెళ్లే ప్రసక్తే లేదని కుండబద్దలు!


తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ పార్టీ పెట్టిన సినీ హీరో విజయ్.. పొత్తుల వ్యవహారంపై ఎట్టకేలకు ఒక స్పష్టత ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించడంతో రాజకీయ వేడి మరింత రాజుకుంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోబోతోందన్న దానిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఊహాగానాలు చెలరేగుతున్నాయి.


బీజేపీ, డీఎంకేలతో పొత్తులు.. త్రిష పేరుతో ప్రచారం


టీవీకే నేతలు ఒకవైపు బీజేపీతో రహస్య చర్చలు జరుపుతున్నారని, వారికి కొన్ని సీట్లతో పాటు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చేందుకు కూడా బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు ప్రముఖ సినీ నటి త్రిష.. టీవీకే, బీజేపీ పొత్తుల కోసం రంగంలోకి దిగారని, ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆమె స్వయంగా చర్చలు జరిపారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. మరోవైపు అధికార డీఎంకేతోనూ టీవీకే నాయకులు టచ్‌లో ఉన్నారంటూ కొన్ని లీక్‌లు వస్తుండటంతో తమిళనాట పొత్తుల రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది.


పుకార్లకు చెక్.. సీఎం ఆఫర్ కూడా తిరస్కరణ!


ఈ ఊహాగానాలన్నింటికీ టీవీకే అధినేత విజయ్ స్వయంగా చెక్ పెట్టారు. తాను ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని, ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలోకి వెళ్లే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తనను రాజకీయంగా అణిచివేయాలని కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూనే, రాబోయే ఎన్నికల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేసి సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని గట్టి నమ్మకాన్ని కనబరిచారు. ఇదిలా ఉంటే, విజయ్‌ను తమ వైపు తిప్పుకునేందుకు జాతీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని, ఇటీవల ఒక జాతీయ పార్టీ ఏకంగా సీఎం పదవిని ఆఫర్ చేసినా విజయ్ దానిని తిరస్కరించారని టీవీకే కీలక నేత అధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.