వేసవి కాలం రాగానే నోరూరించే మామిడి పండ్ల కోసం ప్రతి సామాన్యుడు ఎదురుచూడటం సహజం. తీపి సువాసనలతో జ్యుసీగా ఉండే మామిడి ముక్కను తింటుంటే వచ్చే మజానే వేరు. అయితే, మనసు ఎంత కోరుకుంటున్నా.. "మామిడి పండ్లు తింటే ఒంట్లో వేడి చేస్తుంది, మొటిమలు వస్తాయి" అనే ఒక చిన్న భయం చాలామందిని ఈ అమృతం లాంటి పండుకు దూరం పెడుతోంది. మరి నిజంగానే ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు మామిడి పండ్లు తినకూడదా? ఈ అనుమానాల వెనుక ఉన్న అసలు నిజానిజాలను, ఎలాంటి ఆరోగ్య ముప్పు లేకుండా మామిడిని ఎలా ఆస్వాదించవచ్చో వైద్య నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం.
మామిడి పండ్లు నిజంగానే ఒంట్లో వేడిని పెంచుతాయా?
ఎండలు ముదురుతున్న కొద్దీ చాలామంది మామిడి పండ్లను చూసి భయపడుతుంటారు. సాంప్రదాయకంగా పండిన మామిడి పండ్లకు శరీరంలో వేడిని పుట్టించే గుణం (Thermogenic property) ఉంటుందని, వీటిని ఎక్కువగా తింటే మొటిమలు, వేడి గడ్డలు వస్తాయని నమ్ముతారు. అయితే, మామిడి పండ్లు నేరుగా శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆర్టెమిస్ హాస్పిటల్స్ క్లినికల్ న్యూట్రిషన్ విభాగం అధిపతి శబానా పర్వీన్ స్పష్టం చేశారు. వీటిలో ఉండే సహజ చక్కెరల వల్ల, పరిమితికి మించి తిన్నప్పుడు కొందరిలో జీర్ణక్రియ సంబంధిత అసౌకర్యం కలగవచ్చని ఆమె పేర్కొన్నారు.
మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ పంకజ్ రేలన్ ఈ విషయంపై మరింత క్లారిటీ ఇచ్చారు. మామిడి పండులో చక్కెరలు, క్యాలరీలు ఎక్కువగా ఉండటం వల్ల మనం దాన్ని తిన్నప్పుడు శరీరంలో జీవక్రియల వేగం (Metabolism) కాస్త పెరిగి, తాత్కాలికంగా ఒంట్లో వెచ్చదనం అనిపిస్తుందే తప్ప అది జ్వరం లాగా ఉష్ణోగ్రతను పెంచదు. నిజానికి మామిడి పండులో 80 శాతానికి పైగా నీటి శాతం ఉంటుంది. కాబట్టి పద్ధతిగా తింటే ఇది శరీరానికి డీహైడ్రేషన్ ముప్పును తప్పించే అద్భుతమైన హైడ్రేటింగ్ ఫ్రూట్.
అమృతం లాంటి పండు.. అమితంగా తింటేనే ముప్పు
మామిడి పండు కేవలం రుచి మాత్రమే కాదు.. ఫైబర్, విటమిన్ సి, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియంతో పాటు విటమిన్ బి6, ఎ, కె, ఇ వంటి పోషకాలకు ఇది పవర్హౌస్. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా జీర్ణక్రియకు సహాయపడతాయి. అయితే ఎంత మంచిదైనా అతిగా తింటే కడుపు ఉబ్బరం, బద్ధకం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మధుమేహం, ఊబకాయం, యాసిడ్ రిఫ్లక్స్ లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారు దీని పరిమాణం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
వేసవికాలంలో లభించే ఈ ప్రకృతి ప్రసాదాన్ని ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కూడా సురక్షితంగా ఆస్వాదించడానికి నిపుణులు కొన్ని అద్భుతమైన చిట్కాలను సూచిస్తున్నారు.
మామిడిని ఆరోగ్యంగా తినే 5 సూత్రాలు
మొదటి నియమం.. అతిగా తినకూడదు. రోజుకు ఒక మీడియం సైజు మామిడి పండు సామాన్యుడి శరీరానికి సరిపోతుంది. సమతుల్య ఆహారంలో భాగంగానే దీన్ని తీసుకోవాలి.
రెండోది, మామిడి పండ్లను రాత్రి పూట కాకుండా పగటిపూట తినడమే ఉత్తమం. దీనివల్ల పండులోని క్యాలరీలు శరీరానికి శక్తిగా మారడానికి, సులభంగా జీర్ణం కావడానికి సమయం దొరుకుతుంది. అలాగే ముక్కలుగా కోసిన వెంటనే తినేయాలి. మిగిలిపోతే ఫ్రిజ్లో పెట్టి రెండు రోజుల్లోగా ఖాళీ చేయాలి.
మూడో నియమం.. సరైన కాంబినేషన్ ఎంచుకోవడం. మామిడి పండ్లను ఒంటరిగా కాకుండా పెరుగు, నట్స్ (బాదం, జీడిపప్పు వంటివి) లేదా భోజనంతో కలిపి తీసుకుంటే శరీరంలో చక్కెర శాతాన్ని ఒక్కసారిగా పెరగకుండా అడ్డుకోవచ్చు. కడుపు కూడా నిండుగా ఉంటుంది.
నాల్గోది, నీళ్లు బాగా తాగాలి. ఎండాకాలంలో చెమట రూపంలో నీరు, లవణాలు పోతుంటాయి. ఈ సమయంలో కేవలం తీపి పండ్లు మాత్రమే తింటూ సరిపడా నీళ్లు తాగకపోతే శరీరం అలసటకు గురవుతుంది.
ఐదోది, తినే ముందు నీళ్లలో నానబెట్టడం. చాలామంది మామిడి పండ్లను తినే ముందు కాసేపు నీళ్లలో వేస్తుంటారు. దీనివల్ల పండ్లపై ఉండే రసాయనాలు తొలగిపోవడమే కాకుండా, అందులోని ఫైటిక్ యాసిడ్ బయటకు వెళ్లిపోయి పండు చల్లబడుతుంది.
వేసవి కాలంలో మామిడి పండ్లు ఆరోగ్యానికి అస్సలు హాని చేయవు. సమస్య అంతా మనం తినే పరిమాణంలో, శరీరానికి అందించే నీటి సమతుల్యతలోనే ఉంది. కృత్రిమ చక్కెరలు, క్రీమ్లు నింపిన మ్యాంగో షేక్లు లేదా ప్యాక్డ్ స్వీట్లను పూర్తిగా పక్కనపెట్టి.. సహజ సిద్ధమైన మామిడి పండును పరిమితంగా, పద్ధతిగా తింటే ఏ ముప్పూ లేకుండా ఈ వేసవిని తీపి జ్ఞాపకంగా మార్చుకోవచ్చు!

