Dhurandhar 2: ఇంటర్నేషనల్ స్వాగ్.. రణవీర్ సింగ్ 'ధురంధర్ 2'పై అల్లు అర్జున్ సూపర్ రివ్యూ!

naveen
By -
Allu Arjun on Dhurandhar 2


బాలీవుడ్ సెన్సేషన్ రణవీర్ సింగ్, స్టార్ డైరెక్టర్ ఆదిత్య ధర్ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ రోజు (మార్చి 19న) ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. అయితే, రెగ్యులర్ విడుదలకు ఒక రోజు ముందుగానే మేకర్స్ వేసిన పెయిడ్ ప్రివ్యూలకు (Paid Previews) ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో అద్భుతమైన స్పందన లభించింది. సామాన్య ప్రేక్షకులతో పాటే పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ స్పెషల్ షోలను వీక్షించి సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.


డైరెక్టర్ భారీ సిక్సర్ కొట్టాడు..


ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని పెయిడ్ ప్రివ్యూలో వీక్షించారు. సినిమా చూసిన వెంటనే తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ఒక సంచలన రివ్యూ ఇచ్చారు. ఈ సినిమాను ఒక ‘బ్లాక్ బస్టర్’గా అభివర్ణించిన ఆయన, చిత్ర యూనిట్ మొత్తంపై ప్రశంసల వర్షం కురిపించారు. నేను ఇప్పుడే ‘ధురంధర్ 2’ చూశానని, ఇది స్వాగ్‌తో కూడిన దేశభక్తి చిత్రం అని ప్రశంసించారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా సినిమాను తీశారని, థియేటర్లలో ఈలలు, చప్పట్లు కొట్టే సన్నివేశాలు కోకొల్లలుగా ఉన్నాయని ఆయన అన్నారు. చిత్ర బృందానికి తన హృదయపూర్వక అభినందనలు తెలిపిన బన్నీ.. ఇందులో ఆర్.మాధవన్ నటన అద్భుతంగా ఉందని, సాంకేతికంగా చూస్తే సినిమా టాప్ క్లాస్ అని కొనియాడారు.


 

తన సోదరుడు రణవీర్ సింగ్ లాంటి అద్భుతమైన, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నటుడు మన దేశంలో ఉన్నందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేశారు. ఆర్వీఎస్ (రణవీర్ సింగ్) మళ్లీ తన నటనతో అదరగొట్టాడని, ఇక దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సినిమాతో ఏకంగా భారీ సిక్సర్ కొట్టాడని ఆయన ప్రశంసించారు. ఒక అద్భుతమైన భారతీయ కథను ‘అంతర్జాతీయ స్వ్యాగ్‌’తో (International Swag) ప్రపంచానికి చూపించారని చెబుతూ.. "జై హింద్" అని బన్నీ తన ఎమోషనల్ పోస్ట్‌ను ముగించారు.


ప్రివ్యూలతోనే రూ.44 కోట్ల వసూళ్ల సునామీ


గతేడాది డిసెంబర్‌లో వచ్చిన ‘ధురంధర్’ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ.1,300 కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాపై ఉన్న విపరీతమైన హైప్ చూస్తుంటే.. కేవలం ఇండియాలోనే రూ.1,300 కోట్లు సులభంగా వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు బలంగా అంచనా వేస్తున్నాయి. ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ‘శాక్‌నిల్క్’ (Sacnilk) నివేదికల ప్రకారం.. ‘ధురంధర్ 2’ సినిమా కేవలం నిన్న వేసిన పెయిడ్ ప్రివ్యూల ద్వారానే ఏకంగా రూ.44 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. రెగ్యులర్ రిలీజ్‌కు ముందే కేవలం ప్రివ్యూలతోనే ఇంతటి వసూళ్లు రాబట్టడం చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్ వసూళ్ల సునామీ మొదలైనట్టేనని సినీ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.